Undavalli Lands: అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లి భూముల విలువ నిర్ధారణపై ప్రస్తుతం ఒక పెద్ద వివాదం నడుస్తోంది. ప్రభుత్వం తమ భూములకు తక్కువ ధర కడుతోందంటూ స్థానిక రైతులు ప్రపంచ బ్యాంకును ఆశ్రయించడం, దానికి స్పందనగా అధికారులు నివేదికలు సిద్ధం చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ బ్యాంకుకు రైతుల ఫిర్యాదు
ఉండవల్లి గ్రామ రైతులు తమ భూముల విలువను ప్రభుత్వం చాలా తక్కువగా నిర్ణయిస్తోందని ప్రపంచ బ్యాంకుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకునే సమయంలో ప్రభుత్వం ఈ భూముల విలువను కోట్లలో చూపిస్తోందని, కానీ రైతులకు పరిహారం ఇచ్చేటప్పుడు మాత్రం ఎకరాకు కేవలం రూ.25 లక్షలుగానే లెక్కగడుతోందని వారు ఆరోపించారు.
ఐసీఏఐ (ICAI) నివేదిక ప్రకారం ఇక్కడ గజం భూమి ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉందని, 2014 నాటికే ఎకరా రూ.2.5 కోట్లు పలికేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎకరా ధర రూ.10 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పలుకుతుంటే, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తక్కువ విలువ చూపించి తమకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు.
Also Read: మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!
ప్రపంచ బ్యాంకు స్పందన – సీఆర్డీఏ ఆదేశాలు
రైతుల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు అధికారి ఒలీవర్ తక్షణమే స్పందించారు. ఈ వ్యత్యాసాలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA)కు ఆయన లేఖ రాశారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఈ-మెయిల్ రావడంతో అప్రమత్తమైన సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఉండవల్లి యూనిట్ అధికారులను పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఏపీసీఆర్డీఏకు అధికారిక నివేదిక సమర్పణ
ప్రపంచ బ్యాంకు ఆదేశాల నేపథ్యంలో మంగళగిరి జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉండవల్లి ప్రాంతంలో ఉన్న బేసిక్ మార్కెట్ విలువల వివరాలను క్రోడీకరించి ఏపీసీఆర్డీఏకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఒక అధికారిక నివేదికను సమర్పించారు. ఉండవల్లి భూముల మార్కెట్ విలువలు కాలానుగుణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సవరించబడ్డాయని అధికారులు ఈ నివేదికలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 2015, 2017, 2018, 2019 .. ఇటీవల 2025లో కూడా మార్కెట్ విలువ మార్గదర్శకాలను సవరించినట్లు పేర్కొన్నారు.
రికార్డుల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వ విలువలు
తాజా రిజిస్ట్రేషన్ల రికార్డుల ప్రకారం ఉండవల్లి పరిధిలో ఉన్న భూముల ప్రాథమిక మార్కెట్ విలువలను అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. తాజా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వ్యవసాయ భూముల ప్రాథమిక మార్కెట్ విలువ ఎకరాకు రూ.26.22 లక్షలుగా ఉంది. తోటలు లేదా ఉద్యానవన భూముల విలువ ఎకరాకు రూ.51.12 లక్షలుగా నమోదైంది. నివాస స్థలాలకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో గజం విలువ రూ.5,750గా నిర్ణయించారు. రైతుల ఆరోపణలు ఒకలా ఉంటే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ధరలు మరోలా ఉండటంతో ఈ నివేదిక ఆధారంగా ప్రపంచ బ్యాంకుకు మరియు ప్రభుత్వానికి తదుపరి వివరణలు ఇచ్చేందుకు సీఆర్డీఏ సిద్ధమవుతోంది.