Road Accident: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
ఏలూరు జిల్లాలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డి గూడెం మండలంలోని పుట్లగట్ల గూడెం ప్రాంతంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన ఇంటర్ సిటీ స్మార్ట్ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తోంది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారంతా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. బస్సు డ్రైవర్తోపాటు చాలామందికి తీవ్రగాయాలు అయినట్టు సమాచారం. ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్సు రావడంతో బాధితులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు.
జాతీయ రహదారిపై ఘటన జరగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రేన్ తీసుకొచ్చి ట్రావెల్ బస్సును పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: ఏపీలో రాజకీయాల్లో కొత్త అంకం మొదలు.. అలర్టయిన కూటమి ప్రభుత్వం