Amaravati: ఏపీలో రాజకీయాల కొత్త మలుపు తిరుగుతున్నాయా? అక్కడి రాజకీయాలు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయా? కూటమి పార్టీల సంయుక్త ప్రకటన వెనుక ఏం జరుగుతోంది? తమ తమ సోషల్ యాక్టివిస్టులను ఆయా పార్టీలు ఎందుకు అలర్ట్ చేశాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తోంది. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉంది. అయినా వైసీపీ సోషల్ మీడియా కుట్ర రాజకీయాలు ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. కూటమి పార్టీలను ఏదో విధంగా విడగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నేతల మధ్య చిచ్చును ఆ పార్టీలు తిప్పికొట్టాయి. తాజాగా మరొక అంకానికి తెర లేపినట్టు కనిపిస్తోంది.
కూటమిని విడగొట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు పసిగట్టాయి ఆ మూడు పార్టీలు. అంతేకాదు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఉక్కుపాదం మోపుతోంది సర్కార్. రాష్ట్రాన్ని ప్రతిష్టలను దెబ్బతీసేలా, వ్యక్తుల వ్యక్తి గత జీవితాలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై దూకుడు పెంచారు పోలీసులు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 20కి పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వీటికి సంబంధించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచారు సైబర్ క్రైమ్ పోలీసులు. తప్పుడు సమాచారం, అసభ్యకరమైన వీడియోలు-ఫొటోలు షేర్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు పోలీసులు.
ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్మీడియా విభాగాలు సంయుక్త ప్రకటన చేశాయి. మిత్రపక్షాల నేతలపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయొద్దని తేల్చి చెప్పాయి. ఫేక్ అకౌంట్లతో మిత్రపక్షాల మధ్య విభేదాలు సృష్టించే కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, పార్టీ అభిమానుల్లా నటిస్తూ.. మరో మిత్రపక్ష నేతలను ఫేక్ అకౌంట్లు ద్వారా టార్గెట్ చేస్తున్నట్లు వివరించాయి.
అనుమానాస్పద పోస్టులు, కామెంట్లపై వెంటనే స్పందించొద్దని టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సూచన చేశారు. ఒకవేళ ఫేక్ అకౌంట్ల సమాచారం ఏమైనా ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.మిత్రపక్ష నేతలు-వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత దాడులు చేస్తే వారైనా చర్యలు తప్పవని కూటమి పార్టీల హెచ్చరించాయి.
ALSO READ: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం
కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ఈ సందర్బంగా పిలుపు ఇచ్చాయి. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ఐక్యతే మన బలమని, అభివృద్ధి-సంక్షేమ ప్రచారమే లక్ష్యమని పేర్కొన్నాయి. మనలో మనమే గొడవ పడుతూ వైసీపీకి రాజకీయ ప్రయోజనం కల్పిస్తున్నామని ప్రస్తావించాయి.