RK Roja: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజా కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం దీన్ని ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, అసానికది ‘దగా డీఎస్సీ’గా మారిందని ఘాటుగా విమర్శించారు.
పేపర్ లీకేజీలు.. నకిలీ సర్టిఫికెట్ల విక్రయం
ఈ డీఎస్సీ ప్రక్రియ మొత్తం అక్రమాలమయంగా మారిందని రోజా ఆరోపించారు. పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. అర్హత లేని వారికి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. కష్టపడి చదివిన నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని రోజా ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయని స్పష్టం చేశారు.
లోకేష్ రాజీనామాకు డిమాండ్
డీఎస్సీ నిర్వహణలో జరిగిన విఫలానికి, అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ సమగ్ర వ్యవహారంపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. అదే విధంగా అసలు సూత్రధారులను బయటకు తీయాలని కోరారు.
బాధిత అభ్యర్థులకు వైఎస్సార్సీపీ మద్దతు
నోటిఫికేషన్ నమ్మి మోసపోయిన డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. అభ్యర్థుల న్యాయమైన పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరాహార దీక్షలు, టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు, ప్రభుత్వ తప్పులను సరిదిద్దే వరకు తమ పోరాటం ఆగేది లేదని రోజా తేల్చిచెప్పారు.
Also Read: హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!