Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతోపాటు భారీ వర్షం పడే అవకాశముందని వెల్లడించింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాల మేరకు.. అల్పపీడన ప్రభావంతో బుధవారం రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురసే అవకాశముందని అంచనా వేసింది.
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ వర్షాల సమయంలో ఉరుములు-మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అలాగే సముద్రంలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది.
తెలంగాణలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలకు చల్లటి కబురు వచ్చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగాం, హన్మకొండ మరియు మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వద్దాం. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది. పంట పొలాలకు వెళ్లే రైతులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈదురు గాలులకు చెట్లు- విద్యుత్ తీగలు తెగ పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ALSO READ: లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్, 30 మందికి గాయాలు, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం