Ananthapuram: కంటికి రెప్పలా కాపాడుతానని మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని, అత్యంత దారుణంగా సొంత ఇంట్లోనే వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘోర సంఘటన అనంతపురం జిల్లా బెలగుప్ప మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. బెలగుప్పలో నివాసం ఉంటున్న ఆంజనేయులు, శాంతి దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఎనిమిదో తరగతి చదివే కొడుకు, ఆరో తరగతి చదివే కూతురు ఉన్నారు. ఇంతకాలం వీరి కాపురం సజావుగానే సాగుతున్నట్లు కనిపించినా, గత కొంతకాలంగా వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ భర్త ఆంజనేయులు తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే గురువారం ఇంట్లో భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో విచక్షణ కోల్పోయిన ఆంజనేయులు, ఇంట్లోనే భార్యపై వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆమెను అత్యంత కిరాతకంగా నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో శాంతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
భార్యను చంపిన అనంతరం, ఆంజనేయులు నేరుగా బెలగుప్ప పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే తానే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట నిందితుడు ఆంజనేయులు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త..
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండల కేంద్రంలో దారుణ హత్య
భార్య శాంతిని చంపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త ఆంజనేయులు
వివాహేతర సంబంధమే హత్యకు కారణమని సమాచారం pic.twitter.com/T7DnASJf2c
— ChotaNews App (@ChotaNewsApp) November 13, 2025