Tidco Houses: పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూడు రోజుల్లో 77 మున్సిపాల్టీల అధికారులతో మంత్రి నారాయణ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మొదటిరోజు సమావేశానికి 27 మున్సిపాల్టీల కమిషనర్లు, ఇంజినీర్లు హాజరయ్యారు. వర్క్ షాప్ లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, టిడ్కో ఎండీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
2029లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ది ప్రాజెక్ట్ లపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించారు. మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్ధాలు, డ్రైనేజి, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. జనవరి నుంచి ఘన వ్యర్థాల నిర్వహణ 100 శాతం జరుగుతుందన్నారు. రెండేళ్లలో మున్సిపాల్టీల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
Also Read: YCP Politics: వైసీపీ డిజిటల్ బుక్.. సొంత నేతలకు సెగ, డైలామాలో వైసీపీ అధిష్టానం?
“వివిధ కేంద్ర పథకాలు, ఫండింగ్ ఏజెన్సీల ద్వారా మున్సిపాల్టీల్లో పనులు చేపడున్నాం. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. అమృత్, ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(AIIB), అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(UIDF) నిధుల ద్వారా డ్రింకింగ్ వాటర్, డ్రైనేజి నిర్మాణాలు చేపడుతున్నాం. నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయించాలి. వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలి” అని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.