AP Govt: ఏపీ ప్రభుత్వం పండుగ పూట కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2014-19 మధ్య పనులు చేసి.. బిల్లుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు ఊరట నిచ్చింది. రూ.5 లక్షల మేర పనులు చేసిన అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో రూ.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. దాదాపు రూ.400 కోట్ల మేర నిధులు చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేయనున్నారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పెండింగ్ బిల్లులను పలు విడతల్లో చెల్లిస్తుంది. దసరా పండుగ సందర్భంగా పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దీంతో ఆర్థిక శాఖ పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో చిన్న కాంట్రాక్టర్ల ఖాతాల్లో బిల్లుల సొమ్ము జమ చేయనున్నారు.
ఉద్యోగ, టీచర్ల పెండింగ్ బిల్లులపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల్లోగా బిల్లులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టులో కొన్ని బిల్లులను జమ చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.700 కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా చెప్పారు.
గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.104 కోట్లు రిలీజ్ చేసింది. సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వివిధ పనుల బాధ్యత కార్యదర్శులపై పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోయాయి.
దీంతో కార్యదర్శులు సొంత నిధులను ఖర్చు చేస్తున్నారు. కొన్ని నెలలుగా బిల్లులు పెండింగ్ ఉండటంతో కార్యదర్శులపై ఆర్థిక భారం పెరిగిపోయింది. ఈ విషయాన్ని కార్యదర్శులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సీతక్క చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి నిధుల విడుదలకు కృషి చేశారు.