Coal Supply: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత క్రమంలో ఇంకా ఎక్కువ బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు.
సింగరేణి సీఎండీ మాట్లాడుతూ..
సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి, తెలంగాణ జెన్ కో సీఎండీ డాక్టర్ హరీష్ ప్రస్తుత విద్యుత్ డిమాండ్, బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాలపై శుక్రవారం తమ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినందున, రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా ఇరు సంస్థల సంబంధిత అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. నిరంతరాయ బొగ్గు రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు.
తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు ప్రాధాన్యత..
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్ కోసం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 72 శాతాన్ని సరఫరా చేస్తున్నట్లు సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు సీఎండీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ కేంద్రాల అవసరాలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే బొగ్గు నుంచి సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు.
Also Read: మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?
నాణ్యతలో రాజీ పడేదేలే..
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బొగ్గు ఉత్పత్తి, రవాణా, రైల్వే రేకుల లభ్యత, రోడ్డు రవాణా తదితర అంశాల్లో సింగరేణి, జెన్కో అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఆయా ఏరియాల జీఎంలు చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి తగ్గొద్దని, నాణ్యతలోనూ రాజీ పడకుండా చూడాలన్నారు. అనంతరం జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. జెన్ కో థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వల వివరాలను తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు..
బొగ్గు రవాణాలో ఉన్న ఇబ్బందులపై స్థానిక ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, ఈడీ(కోల్ మూవ్మెంట్) వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) శ్రీనివాస్, జెన్ కో డైరెక్టర్లు నాగయ్య, రాజశేఖర్, సీఈలు బిచ్చన్న, లక్ష్మయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!