CM Chandrababu: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో శనివారం పర్యటించిన చంద్రబాబు.. లింగంగుట్ల గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. అంతకుముందు చిలకలూరిపేట టౌన్ లోని స్థానిక పత్తిపాటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
వ్యవసాయమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్నదాత కష్టాలను గుర్తించే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పథకాలను రూపొందిస్తున్నామని సీఎం అన్నారు. ప్రతి పైసా నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పారదర్శకంగా చేరుతోందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రేణుల పాత్ర కీలకమని ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
లింగంగుంట్ల గ్రామంలో పర్యటన సందర్భంగా అక్కడి అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు జావ తాగారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందిస్తోన్న సేవలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ ప్రాంగణంలో అంగన్వాడీ సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Weather Alert: విజయవాడ, గుంటూరు ప్రజలకు హై అలర్ట్.. రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..!
ఇదిలా ఉంటే ఇవాళ నారా భువనేశ్వరి పుట్టిన రోజు కావడంతో.. సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు. మంచి భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా రాణిస్తూనే తమ జీవితాల్లో వెలుగులు నింపావంటూ ఆకాశానికెత్తారు. భువనేశ్వరిలోని సౌమ్య, దయా గుణం ఎందరికో స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఇంతటి అద్భుతమైన వ్యక్తితో జీవిత ప్రయాణాన్ని పంచుకున్నందుకు తాను రుణపడి ఉన్నానని చంద్రబాబు రాసుకొచ్చారు.
Also Read: పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!