Commissioner Kannababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన లభ్యతపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టతనిచ్చారు. సోమవారం అమరావతిలో ‘బిగ్ టీవీ’ (BIG TV) తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. డిమాండ్కు తగినట్లుగా సరఫరా జరుగుతోందని అయితే ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావడం వల్లే బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నిన్న ఆదివారం కావడం వల్ల ఆయిల్ కంపెనీల నుంచి సరఫరాలో స్వల్ప అంతరాయం ఏర్పడిందని ఈ రోజు రాత్రి కల్లా అన్ని బంకులకు పూర్తిస్థాయిలో ఇంధన నిల్వలు చేరుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుందని కమిషనర్ తెలిపారు. బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే ప్రస్తుతం వాహనదారులకు పరిమితంగా ఇంధనాన్ని నింపుతున్నామని వివరించారు. పరిశ్రమలకు చెందిన వారు రిటైల్ బంకుల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ తరలిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు గుర్తించాయని దీనివల్ల కూడా సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగిందని ఆయన విశ్లేషించారు.
రాష్ట్రంలో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోందని డీలర్లు ఇండెంట్ పెట్టిన దాని ప్రకారం వెంటనే సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కన్నబాబు వెల్లడించారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన క్రెడిట్కు మరియు ప్రస్తుత సరఫరాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కంపెనీ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని ముఖ్యంగా ప్రస్తుత సీజన్లో వ్యవసాయదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగినన్ని డీజిల్ నిల్వలు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.
ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ రోజు రాత్రికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని కమిషనర్ భరోసా ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అనంతరం అధికార యంత్రాంగం అప్రమత్తమైందని టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘నో స్టాక్’ బోర్డులు లేకుండా చూడటమే తమ ప్రాధాన్యతని కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.
Read Also: పెట్రోల్ బంకుల దగ్గర అసలేం జరుగుతోంది? ఒక్క రూమర్.. రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం!