CM Chandrababu: శ్రీవారి పరకామణి దొంగతనం వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో మాట్లాడుతూ.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జగన్ కు దేవుడన్నా లెక్కలేదు… ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా లెక్కలేదు… ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని మండిపడ్డారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూశారని ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూశారని, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని మండిపడ్డారు.
‘దొంగతనాన్ని కూడా తప్పు కాదని చెప్పే వాళ్లను ఏమనాలి? సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యాలా? దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా? తప్పేముందని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నాడు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశాం అని తేలిగ్గా మాట్లాడుతున్నాడు. భక్తుల ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి?’- సీఎం చంద్రబాబు
శ్రీవారి పరకామణిలో చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోను తీవ్ర ఆవేదన కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారన్నారు. 72 వేలు అనేది చిన్న దొంగతనం చెప్తున్నారని, దేవుడి హుండీలో చోరీ చిన్న తప్పా? దాన్ని సెటిల్ చెయ్యడం మహాపాపం కాదా? అని మండిపడ్డారు. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం అవుతాయన్నారు.
‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటం లేవు. గత ప్రభుత్వం ప్రశాంతమైన మంచి ప్రాంతాలను కూడా నేరమయం చేశారు. నేరస్తులను పెంచి పోషించారు. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లు ఎప్పుడైనా చూశామా? ఇటువంటి సంస్కృతికి కారణం ఎవరు? విజయనగరం, నెల్లూరు వంటి జిల్లాలకు ప్రశాంతకు మారుపేరుగా ఉండేవి. ఈ జిల్లాలకు ఎలాంటి అధికారులను ఎస్పీలుగా నియమించినా సరిపోయేది. కానీ గత పాలకుల వల్ల ఈ జిల్లాల్లో కూడా నేరస్తులు తయారు అయ్యారు. నెల్లూరు లాంటి జిల్లాలో లేడీ డాన్లు తయారు చేశారంటే… 5 ఏళ్లు ఎలాంటి పాలన సాగిందో అర్థం చేసుకోవాలి. వీటిని ప్రక్షాళన చేస్తున్నాం, నేరస్తులను ఏరివేస్తున్నాం, రౌడీలను అణిచివేస్తాం’ అని సీఎం చంద్రబాబు చిట్ చాట్ లో అన్నారు.
Also Read: Parakamani: పరకామణి చోరీపై జగన్ కామెంట్స్ దుమారం
రాజధాని రైతులు, నిర్మాణం అంశాలపై సమస్యలు అన్నీ పరిష్కరిస్తున్నామని, రాజధాని పనుల వేగం పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతో రాజధాని రైతుల సమావేశం తరువాత మంచి ఫలితాలు వస్తున్నాయని, రైతులు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. రెండో ఫేజ్ భూ సమీకరణకు కూడా రైతులు ముందుకు వచ్చారని, ఇది మంచి పరిణామమన్నారు. ప్రజలు, రైతులు, ప్రభుత్వం అంతా సంతోషంగానే ఉన్నారని, కొందరికి మాత్రం కడుపుమండుతోందన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక బ్రాండ్ గా మారిందని, విద్యా శాఖలో తీసుకువస్తున్న మార్పులు ఫలితాలను ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.