AP CM Jagan Comments: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కలిసి విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కూటమిలో ఉన్నా కూడా మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని, అందుకే వాళ్లు మోదీ ఫొటో పెట్టలేదన్నారు. చివరకు మేనిఫెస్టోలో ముగ్గురి ఫొటోలను పెట్టుకునే పరిస్థితి కూడా చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగుతాయని, జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా వస్తాయంటూ జగన్ పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే అవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే.. చంద్రబాబు మళ్లీ వచ్చి.. వదల బొమ్మాలీ అంటూ పసుపతి మళ్లీ లేచి.. మీ రక్తం తాగుతాడంటూ జగన్ విమర్శించారు. అదేవిధంగా రైతుల గురించి కూడా జగన్ మాట్లాడారు. చంద్రబాబు రైతులకు ఏరోజైనా రైతు భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబును ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. అమ్మఒడి, చేయూత లాంటి గొప్ప పథకాలను అందించిన ఘనత తమదేనన్నారు. తమ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వృద్ధులకు నేరుగా పెన్షన్ ఇచ్చామని, కానీ చంద్రబాబు వృద్ధుల గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. అంతేకాదు.. నీవు మూడుసార్లు సీఎంగా పనిచేశావు.. ఇప్పుడు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా నీ హయాంలో అమలు చేసిన స్కీమైనా గుర్తొస్తదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Also Read: ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల.. అమరావతే రాజధాని..
అయితే, మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో టీడీపీ-జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్న విషయం విధితమే.