Raghurama Interview : కూటమిలోనూ కొన్ని విధేదాలు ఉన్నాయని.. సర్దుకుపోవడమే రాజకీయమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కలకాలం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలని మరోసారి పిలుపు ఇచ్చారు. అనుకున్నట్టు సభ జరగకపోయినా.. గతంకంటే బెటర్గా నడుస్తోందన్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించారు ఉండి ఎమ్మెల్యే రఘురామ.
జగన్ మూర్ఖత్వం ఇదే..
వ్యక్తిగతంగా తనకు ఎంపీ పదవి అంటేనే ఇష్టమని.. కొన్ని పరిస్థితుల వల్ల ఎమ్మెల్యే అయ్యానని.. అయినా, పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ను అవుతానని తాను అనుకోలేదన్నారు. జగన్ ప్రతిపక్షానికే పరిమితం అవుతారని మూడున్నరేళ్ల కిందటే చెప్పానని.. ఇప్పుడు ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి వస్తాననడం జగన్ మూర్ఖత్వం అని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ ఒక్కోటీ అమలు చేస్తారని చెప్పారు రఘురామ. తొందరెందుకు.. పథకాలపై వైసీపీ గోల ఎందుకని ప్రశ్నించారు.
పేడలో కాలేసి వాసన చూశారు..
అమరావతిపై జర్నలిస్టులు కొమ్మినేని, కృష్ణంరాజులు చేసిన కామెంట్స్పై రఘురామ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో తన ఫోటోలను వైసీపీ నేతలు చెప్పులతో కొట్టించారని.. ఇప్పుడు జగన్ మనుషుల ఫోటోలను అమరావతి చెప్పులతో కొట్టారని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆ మహిళలను సంకర జాతి అంటూ సజ్జల మాట్లాడటం మరింత దారుణం అన్నారు. కొమ్మినేని, కృష్ణంరాజులు పేడలో కాళ్లు వేశారు.. అది పేడనా కాదా అని సజ్జల వాసన చూశారంటూ రఘురామ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
వారిని ఉరి తీయాలి..
ఇక కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ పాలన, వరుస అరెస్టులపైనా రఘురామ స్పందించారు. బోరుగడ్డ అనిల్ ఎలాంటి మాటలు మాట్లాడాడు? అలాంటి వాడిని ఎలా వదిలేస్తారు? అని మండిపడ్డారు. చంద్రబాబు సతీమణిని వల్లభనేని వంశీ ఎంత మాటన్నాడు.. అంత దారుణంగా మాట్లాడిన నేతలను ప్రజలు మన్నించరన్నారు. వంశీ, అనిల్ లాంటి వాళ్లతో జగనే అలా మాట్లాడించాడని.. వారికి ఉరి శిక్ష వేసినా తక్కువేనని రఘురామ హాట్ కామెంట్స్ చేశారు.
తప్పు చేశారు కాబట్టే..
కూటమి ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు కావని.. తప్పు చేశారు కాబట్టే నేతలు, అధికారులు జైలుకెళ్తున్నారని అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే.. అసమర్థ ప్రభుత్వమనే ముద్ర పడుతుందని చెప్పారు. జైలు పాలైన నేతలకు ప్రజల్లో సానుభూతి రాదని స్పష్టం చేశారు.
సునీల్ను ఎందుకు పిలవలేదు..
జగన్ హయాంలో తన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ జరుగుతున్న తీరుపై రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ను ఇప్పటికీ ఎంక్వైరీకి పిలవలేదని.. ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.
ఉండిలో బెంచ్ మార్క్ డెవలప్మెంట్
ఉండి ఎమ్మెల్యేగా తాను చేస్తున్న అభివృద్ధి పనులను బిగ్ టీవీకి వివరించారు రఘురామ. ఉండిలో మెయిన్ ప్రాబ్లమ్ డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటరే అని.. ఆ రెండు విషయాలపై తాను పూర్తిగా ఫోకస్ చేశానని చెప్పారు. ఏడాది కాలంలోనే కాలువలు అన్నీ బాగు చేయించానని.. ఈసారి ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. అన్ని గ్రామాల్లో మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసి.. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నానని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిధుల కంటే.. తన సొంత పరపతితో తీసుకొచ్చి ఖర్చు చేసిన డబ్బులే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. స్కూల్స్ రిపేర్ చేయిస్తున్నానని.. పోలీస్ ష్టేషన్ బిల్డింగ్ కూడా కట్టించానని.. రూ.50లక్షలతో పోలీసులకు 4 వాహనాలు కొన్నామని చెప్పారు. ఉండిలో వందలాది సీసీకెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని అనుసంధానించేందుకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయించానని అన్నారు. చాలా పనులు గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకోకుండానే చేపట్టినట్టు చెప్పారు. ఉండి అభివృద్ధిలో తనదైన బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నానని.. దాన్ని దాటడం ఎవరికీ ఈజీ కానంత ఉన్నతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నానని రఘురామ తెలిపారు.
బిగ్ టీవీతో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి…