Vijayawada News: పాఠశాలలు, ఇంటర్ చదివే పిల్లలపై ఓ కన్ను వేయాలని పదే పదే పోలీసులు చెబుతున్నారు. అయినా కొందరు పేరెంట్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక అనర్థాలు జరిగాయి.. జరుగుతున్నాయి. అర చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు పేరెంట్స్ అవేమీ పట్టించుకోలేదు.
వారిద్దరు మైనర్లు.. లేచిపోయి హైదరాబాద్కు పయనం
ప్రేమంటే ఏంటో తెలియని పసి వయస్సు వారిది. బాలుడి వయస్సు 13 ఏళ్లు.. బాలికకు 14 ఏళ్లు. ఆకర్షణకు లోనయ్యారు, ఇంటికి దూరంగా జీవితం సాగించాలని హైదరాబాద్ సిటీకి వచ్చారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో వారి పేరెట్స్ కంగారు పడ్డారు, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే.. ఓ ఆటోడ్రైవర్కి వారిద్దరు చిక్కారు. ఆ తర్వాత ఏం జరిగింది?
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన మైనర్లు ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలుడి వయస్సు 13 ఏళ్లు కాగా, బాలిక వయస్సు 14 ఏళ్లు. వీరిద్దరికి రెండేళ్లుగా పరిచయం ఉంది. తెలిసి తెలియని వయస్సులో ఆకర్షణకు లోనయ్యారు.. అది ప్రేమగా భావించారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో పాఠశాలకు వెళ్లలేదు.
బాలుడికి 13 ఏళ్లు.. బాలిక 14 ఏళ్లు, పేరెంట్స్కు చెమటలు
స్కూల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బాలిక, బాలుడి ఇంటికి వచ్చేసింది. బాలిక ఇంటికి వచ్చిన సమయంలో ఇంట్లో అబ్బాయి పేరెంట్స్ లేవు. ఆ తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత బాలిక తన ఇంటికి వెళ్లిపోయింది. మధ్యాహ్నం భోజనం తర్వాత పాఠశాల పేరుతో బాలుడి ఇంటికి వచ్చింది. బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10 వేలు తీసుకుని ఇద్దరు కలిసి హైదరాబాద్కు బస్సు ఎక్కారు.
స్కూలు సమయం దాటినా బాలిక రాకపోవడంతో పేరెంట్స్ కంగారు పడ్డారు. పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. ఇవాళ రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో షాకయ్యారు. ఏం చెయ్యాలో తెలియన కాసేపు ఆలోచించి, బాలిక ఫ్రెండ్స్ గురించి తెలుసుకుని ఆరా తీశారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో కృష్ణలంక పీఎస్లో ఫిర్యాదు చేశారు.
సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, యూనిఫాంలో వీరిద్దరు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అంతలో బాలుడి కనిపించలేదని వాళ్లు పేరెంట్స్ పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాలిక-బాలుడు కలిసి హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. బాలుడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆన్ చేయగానే వారు హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ALSO READ: అమరావతిలో డజను ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రమంత్రి శంకుస్థాపన
హైదరాబాద్కు విజయవాడ నుంచి ఓ పోలీసు టీమ్ బయలుదేరింది. బుధవారం రాత్రి 10 గంటలకు వనస్థలిపురంలో దిగారు ఇద్దరు మైనర్లు. ఆటో ఎక్కి తుక్కుగూడ వెళ్లి అద్దె ఇంటి కోసం వెతికారు. మైనర్ల వ్యవహారశైలిని గమనించిన ఓ ఆటోడ్రైవర్, వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. వివరాలు కనుక్కొని వారి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
ఈలోగా పోలీసులకు పిల్లల పేరెంట్స్ సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. వారికి స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చి, వారి వారి పేరెంట్స్కు అప్పగించారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త, పిల్లల విషయంలో ఓ కన్నేయకుంటే ఇలాంటి అనర్థాలు తప్పవు.