AP Govt: ప్రభుత్వ టీచర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలకు సంబంధం లేని పనుల్లో టీచర్లను భాగస్వామ్యం చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల కలెక్టర్లు టీచర్లకు ఇతర పనులు అప్పగిస్తున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్కు ఇదొక రిలీఫ్ అన్నమాట. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల విద్య డైరెక్టర్కు తెలియకుండా ఆ విభాగానికి సంబంధం లేని పనులు అప్పగించరు. స్కూళ్లకు సంబంధం లేని పనులను టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్కు అప్పగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు.
హెచ్వోడీల అనుమతి లేకుండా సంబంధం లేని ఇతర పనులు చేయకూడదన్నారు. మరీ ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల బోధనకు అడ్డంకి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఉపాధ్యాయులకు ఉపశమనం దక్కింది.
ఏపీ వ్యాప్తంగా బీసీ వసతి గృహాల విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 6 నుంచి 9 వరకు ఆ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడం, మంచి వాతావరణాన్ని పెంచడానికి ఆయా వేడుకలు జరగనున్నాయి.
ALSO READ: ఏపీ వైపు చూడండి.. అన్నీ అద్భుతాలే, సింగపూర్లో సీఎం చంద్రబాబు
అన్ని తరగతుల విద్యార్థులు, వారి పేరెంట్స్, విద్యా కమిటీల సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి సవిత వెల్లడించారు. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.నేటి నుంచి (మంగళవారం) అక్టోబరు 10 వరకు ఆయా శిబిరాలను నిర్వహిస్తామని సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
మరోవైపు పీ-4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయడాన్ని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్బంధ రిజిస్ట్రేషన్లను బహిష్కరించాలని పిలుపు ఇచ్చింది. కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రతీ ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడం ముమ్మాటికీ సరికాదని పేర్కొంది.
దత్తత తీసుకునే అంశం ఐచ్ఛికంగా ఉండాలికానీ, నిర్బంధం చేయడం సరి కాదని వెల్లడించింది. ఏలూరు జిల్లా విద్యాధికారి సోమవారం సాయంత్రం లోపు పీ-4 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడాన్ని ఖండించింది. ఉపాధ్యాయులు దత్తత తీసుకొని ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు ఫ్యాప్టో నేతలు. స్వచ్ఛందంగా దత్తత తీసుకుంటే సంతోషిస్తామని, ఈ విషయాన్ని గుర్తించాలని సంఘాల నాయకులు కోరారు.