AP Government: ప్రజల ఆరోగ్యం, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఏపీ సర్కార్ పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. రాయలసీమ జిల్లాలో ఏప్రిల్ నుంచే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది.
పలు జిల్లాలో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తుంది. 20 KGS రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్టంగా 3kgs వరకు రాగులు, జొన్నలు, 17 kgs బియ్యం ఇస్తోంది. కాగా టీడీపీ ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగిపిండిని పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జాతీయ ఆహార భద్రత పథకం (NFSA)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రాలకు తగిన రాగులు, జొన్నలను కేటాయించేది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేంద్రం తృణధాన్యాలను కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముందుకు వచ్చి వాటిని మార్కెట్ నుండి టెండర్ ప్రక్రియ ద్వారా ప్రొక్యూర్ చేస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిల్వలు సిద్ధం చేసిన వెంటనే జిల్లాల వారీగా పంపిణీ వేగవంతం అవుతోంది.
రాగులు, జొన్నలపై ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధుల కోసం ఇవి ఆరోగ్యవంతమైన ఆహారంగా భావించి అనేక కుటుంబాలు స్వచ్ఛందంగా కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి రావడంతో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో మాత్రమే పంపిణీ జరుగుతున్నా, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ దీనిని దశలవారీగా మొత్తం రాష్ట్రానికి విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నిల్వలు, సరఫరా వ్యవస్థ, కొనుగోలు ప్రక్రియను బలోపేతం చేసి, వచ్చే నెలల్లో అన్ని జిల్లాల్లోనూ తృణధాన్యాలు రేషన్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.
Also Read: దొంగలతో సెటిల్మెంటా? అది మహాపాపం కాదా? జగన్పై చంద్రబాబు ఫైర్
రాగులు, జొన్నలు రేషన్లో చేరడం ఆరోగ్య భద్రతకు దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేదలలో పోషక లోపాలు తగ్గడం, తృణధాన్యాల వినియోగం పెరగడం, రైతుల పంటలకు గిట్టుబాటు ధర రావడం ఇవన్నీ కలిపి.. ఈ నిర్ణయం రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.