తల్లికి వందనం పథకం విషయంలో సీఎం చంద్రబాబు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేపు, అంటే జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం నిధుల్ని అకౌంట్లలో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈరోజే జీవో విడుదలవుతుంది, రేపు ఉదయం అకౌంట్లలో డబ్బులు జమ కావడమే ఆలస్యం.
సూపర్ సిక్స్ లో మరో కీలక హామీ..
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటీ అమలు చేస్తోంది. పెన్షన్ల పెంపుని వెంటనే ప్రారంభించింది. అన్నా క్యాంటీన్లు తెరిచింది. మెగా డీఎస్సీ రిక్రూట్ మెంట్ పూర్తవుతోంది. దీపం-2 పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తల్లికి వందనం పథకాన్ని పట్టాలెక్కిస్తోంది.
#TallikiVandanam #AndhraPradesh
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్… pic.twitter.com/CCENI7KKCS
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
ఊహించని విధంగా..
తల్లికి వందనం పథకంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేరని, అప్పుల లెక్కలు చెబుతూ వాయిదా వేస్తున్నారని జగన్ పలుమార్లు మండిపడ్డారు. తొలి ఏడాది ఈ పథకం అమలు చేయలేకపోయినా, రెండో ఏడాది అమలు చేస్తామని చెబుతూ వస్తున్నారు కూటమి నేతలు. ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలో డబ్బులు జమ చేస్తామంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా రేపే ఈ పథకం అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
67 లక్షలమంది తల్లులకు..
తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగబోతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే, వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి 15వేల రూపాయలు జమ చేస్తారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లి ఖాతాలో 30వేల రూపాయలు జమ అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. 67 లక్షలమంది తల్లుల ఖాతాల్లో మొత్తంగా రూ. 8745 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అడ్మిషన్లు పూర్తై, వారి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో కూడా నిధులు జమ అవుతాయి.
ప్రతిపక్షానికి గట్టి జవాబు..
ఇన్నాళ్లూ తల్లికి వందనంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం చంద్రబాబు నిర్ణయంతో ప్రతిపక్షానికి గట్టి జవాబు చెప్పినట్టవుతుంది. గతంలో జగన్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక రేషన్ కార్డుకి ఒక విద్యార్థికి మాత్రమే నిధులు జమ చేసేవారు. కానీ కూటమి ఎన్నికల హామీలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే, వారందరికీ తలా 15వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు అది అమలు చేసి చూపించబోతున్నారు. ఈ పథకం సక్సెస్ అయితే, అనుకున్నట్టుగా అమలు అయితే వచ్చే ఎన్నికల్లో కూడా కూటమికి తిరుగు ఉండదని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షం నోటికి తాళం వేసినట్టవుతుందని చెబుతున్నారు.