AP Students: మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా.. అయితే మీ పిల్లల కోసమే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందరో విద్యార్థులకు మంచి అవకాశం దరిచేరనుంది. ఇప్పటికే విద్యార్థులను ఎంపిక చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంతకు ఏంటా అవకాశం? విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
సాధారణంగా విద్యార్థులకు విహారయాత్రలంటే చాలా ఇష్టం. చాలా వరకు ప్రవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులను విహారయాత్రలకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు తీసుకెళుతూ ఉంటాయి. ఇలాంటి యాత్రల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు, నూతన అంశాలపై పట్టు లభిస్తుంది. ఏదైనా చారిత్రాత్మక కట్టడాలు, నగరాల సందర్శనకు విద్యార్థులను తీసుకెళ్లినట్లయితే ప్రత్యక్షంగా వాటిని చూడడం ద్వారా అక్కడి అంశాలు ఇట్టే వారిని ఆకర్షిస్తాయి. అయితే అప్పుడప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ఇలా విహారయాత్రలకు తీసుకు వెళుతుంటారు.
ప్రభుత్వం మాత్రం విహారయాత్రల గురించి భిన్నరీతిలో ఆలోచించింది. ఇప్పటికే విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యాభోదనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర పరిధిలో విహారానికి ఒక్కో విద్యార్థికి రూ.200, ఇతర రాష్ట్రాలకు రూ. 2 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇలాంటి విజ్ఞాన యాత్రల ద్వారా విద్యార్థుల్లో నూతన అంశాలపై పట్టు, సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని, ప్రభుత్వ పాతశాలల్లోని విద్యార్థులకు ఇదొక సదవకాశమని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఈ యాత్రకు విద్యార్థుల ఎంపికను వారి విద్యా సామర్థ్యాన్ని బట్టి నిర్వహిస్తారని తెలుస్తోంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై ఇప్పటికే సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు
ఉత్తర్వులిచ్చారు.
ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల అధ్వర్యంలో విద్యార్థుల ఎంపిక సాగుతుండగా, త్వరలోనే విజ్ఞాన యాత్రలకు వెళ్లేందుకు అన్నీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ యాత్రలకు వెళ్లే అవకాశం మరి ఎవరికి వరిస్తుందో కానీ, శాస్త్ర సాంకేతిక సంబంధిత అంశాలపై ఆ విద్యార్థులకు పట్టు రావడం ఖాయమని పాఠశాలల ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు పాఠశాల విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. కోట్లల్లో విరాళం అందించిన ఆ భక్తుడెవరంటే?
పదవ తరగతి విద్యార్థుల వరకే అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నారు. అలాగే రానున్న పరీక్షల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను సైతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు. పెద్ద పండగ అనే కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిపై సమీక్షించిన ప్రభుత్వం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. విద్యాభివృద్దికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ప్రభుత్వం తాజాగా విజ్ఞాన యాత్రలకు విద్యార్థులను తీసుకెళ్లాలని నిర్ణయించడం అభినందనీయం.