AP Govt on Ration: ఏపీలో మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు తప్పక తెలుసుకోండి. ఎందుకంటే రేషన్ సేవలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ విషయాలు తెలుసుకుంటేనే మీరు రేషన్ కార్డు ద్వారా అందే లబ్దిని పొందగలుగుతారు. అందుకే ఈ కథనం మొత్తం చదవండి.. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై అవగాహన కల్పించుకోండి.
ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (MDUs) విధానాన్ని నిలిపివేస్తూ, మళ్లీ మునుపటి తరహాలో చౌకధర దుకాణాల ద్వారా నేరుగా రేషన్ సరుకుల పంపిణీ చేయనుంది. ఈ మార్పుతోపాటు, రేషన్ కార్డుదారుల సమాచారాన్ని నవీకరించడం, కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రేషన్ కార్డు కాదు ఇదొక వరం
రేషన్ కార్డు లేని కుటుంబానికి ఏ ఒక్క పథకం వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ లకు అనర్హులే. అంతేకాదు రేషన్ సరుకులు కూడా అందని పరిస్థితి. అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సంధర్భంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది.
MDUs వైఫల్యం.. ఎందుకీ మార్పు?
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న మొబైల్ డిస్పెన్సింగ్ వ్యాన్ల ద్వారా సరుకుల పంపిణీపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. IVRS ఫీడ్బ్యాక్ ప్రకారం –
25 శాతం మంది రేషన్ సరుకులు అందలేదని, 26 శాతం మంది అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. MDU ఒక నెలలో కేవలం 3 FPS ప్రాంతాలను మాత్రమే కవర్ చేయగలుగుతుంది. 570 వ్యాన్లు వినియోగంలో లేవన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. 288 రైస్ డైవర్షన్ కేసులు నమోదు కావడం, ఇలాంటి కారణాలతో ప్రభుత్వం మొబైల్ వ్యాన్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, గతంలోని 29 వేల చౌకధర దుకాణాల విధానాన్ని మళ్లీ ప్రారంభించనుంది.
కొత్త మార్గదర్శకాలు ఇవే..
జూన్ 1 నుండి రేషన్ సరుకులు చౌకధర దుకాణాల ద్వారా నేరుగా పంపిణీ చేయబడతాయి. ఇంతవరకూ మీకు రేషన్ కార్డు ఉంటే, మీరు మీకు చెందిన దుకాణంలో నేరుగా వెళ్లి సరుకులు పొందొచ్చు. ఎప్పటిలాగే బయోమెట్రిక్ ద్వారా ఆధారపడిన పంపిణీ కొనసాగుతుంది. నెల చివరి వారం నుంచే అందుబాటులో వస్తువుల వివరాలు SMS ద్వారా తెలియజేస్తారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం రేషన్ సరుకులు ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డు అవసరం. ఆ వివరాలు మీ స్థానిక సచివాలయం వద్ద అందుబాటులో ఉంటాయి.
మీకు రేషన్ కార్డు లేకపోతే?
ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల జాబితా సిద్ధమవుతోంది. మీకు కార్డు అవసరమైతే, మీ జననతేదీ ఆధారంగా కుటుంబ వివరాలు కలిగిన ఆధార్ కార్డు
ఆధారంగా ఇంటి సమీపంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేయండి. నూతన రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ను EPDS వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అర్హత కలిగిన వారు, గ్రామ వాలంటీర్లు, డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా స్వచ్ఛందంగా వివరాలు సమర్పించవచ్చు.
Also Read: Water Falls In AP: విదేశాలకెందుకు? ఈ అద్భుత జలపాతం సాగర్ దగ్గరలోనే!
MDU వాహనాల నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.353.81 కోట్ల బడ్జెట్ ఆదా అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మున్ముందు చౌకధర దుకాణాల ద్వారా నోట్బుక్లు, సబ్బులు, నిత్యవసర వస్తువులను కూడా విక్రయించేందుకు వీలుగా మారుస్తామని తెలుస్తోంది. అలాగే MDU వాహనాల కోసం కార్పొరేషన్ ద్వారా వాహనం పొందిన వారు, 10% డౌన్పేమెంట్ చేసినవారికి వాహనాలను ఉచితంగా ఇవ్వనున్నారు. ఇది ఒకరకంగా MDU వాహనాలు పొందిన వారికి మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నిర్ణయాలు తప్పక తెలుసుకోండి.. నెలవారీ రేషన్ సరుకులను మీ సమీపంలోని చౌక దుకాణాలలో దర్జాగా పొందండి.