AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న “సెన్యార్” తుపాను తీరం దాటిందని తెలిపింది.
వాతావరణ మార్పుల దృష్ట్యా శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో పలు చోట్ల ఈశాన్య గాలులు బలంగా వీస్తాయని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.
సెన్యార్ తుపాన్ ఇండోనేషియాను తాకింది. అక్కడ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఏపీపై తుపాను ప్రభావం లేకపోయినా.. తమిళనాడు తీరంలోని చెన్నై, కడలూరు, నాగపట్టినం జిల్లాలతో పాటు కేరళలోని కొన్ని జిల్లాల్లో గంటల తరబడి భారీ వర్షం కురిసింది. అండమాన్ & నికోబార్ దీవుల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మరింత రెండు రోజుల పాటు ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు ఈ వారం సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.