Andhra King Taluka : మన టాలీవుడ్లో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తే.. అందులో ఎక్కువ శాతం ముంబైకి చెందిన వాళ్ళే అవుతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 5 దశాబ్దాలుగా టాలీవుడ్లో చక్రం తిప్పుతుంది బాలీవుడ్ భామలే. తెలుగులో ఇంతమంది హీరోయిన్లను పెట్టుకుని ముంబై అమ్మాయిలకే ఎందుకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు అని ఫిలిం మేకర్స్ ని అడిగితే.. అందుకు ఎక్కువ శాతం చెప్పే సమాధానం.. ‘ముంబై అమ్మాయిలు అయితే గ్లామర్ షోకి అడ్డు చెప్పరు..పాత్ర ఎలా ఉన్నా చేసేసి వెళ్ళిపోతారు’ అని. వాటితో పాటు మరిన్ని ఫేవర్లు కూడా మేకర్స్ కి వాళ్ళు చేసి పెట్టొచ్చు. అది వేరే విషయం. సో మన ఫిలిం మేకర్స్ కి ముంబై భామలు అయితే కంఫర్ట్ గా ఫీలవుతారు.
తెలుగమ్మాయిలు అయితే వాళ్ళు స్కిన్ షోకి అంగీకరించరు, పైగా పాత్రల విషయంలో చాలా గొడవలు చేస్తారు అని కూడా ఎక్కువ మంది చెబుతుంటారు. మన తెలుగమ్మాయిలపై దర్శకనిర్మాతలకు ఉన్న ఆ నమ్మకమే ముంబై భామలకు డిమాండ్ పెరిగేలా చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.
గతేడాది భాగ్య శ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ తో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో ఈ అమ్మడు చేసిన అందాల విందు అంతా వేస్ట్ అయిపోయిందని అంతా అనుకున్నారు.
కానీ భాగ్య శ్రీకి తర్వాత మంచి ఆఫర్లే లభించాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాకి నాగవంశీ నిర్మాత. 2వ సినిమానే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి పెద్ద బ్యానర్లో చేసే అవకాశం పొందడం అంటే మామూలు విషయం కాదు.
కానీ ‘కింగ్డమ్’ లో భాగ్య శ్రీ పాత్ర ఎటూ కానట్టు ఉంటుంది. దానికి తోడు ఆమెపై చిత్రీకరించిన ఒకే ఒక్క లవ్ సాంగ్ ని కూడా ఎడిటింగ్లో లేపేశారు. పోనీ సినిమాకి హిట్ టాక్ వచ్చిందా అంటే అదీ లేదు. అందుకే ‘కింగ్డమ్’ కూడా భాగ్య శ్రీకి కలిసిరాలేదు. అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ అనే పెద్ద సినిమాలో ఈమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. వాస్తవానికి ఆమె హీరోయిన్ గా ఫస్ట్ సైన్ చేసిన సినిమా ఇదే. సినిమాలో ఈమె నటన కూడా బాగుంది. కానీ దురదృష్టం అనుకోవాలి. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.
తనకి ఉన్న గ్లామర్ పుణ్యమాని భాగ్య శ్రీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ స్టార్ గా ఎదగాలి అంటే సక్సెస్ మస్ట్. అందుకే ఇప్పుడు హోప్స్ అన్నీ తన నెక్స్ట్ సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పై పెట్టుకుంది. రామ్ హీరోగా నటించిన సినిమా ఇది. నవంబర్ 27న విడుదలవుతుంది. సినిమాకి ఎటువంటి బజ్ లేదు. కానీ మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. మంచి ఫలితం అందుకునే ఛాన్స్ లేకపోలేదు. పైగా ఈ సినిమాలో భాగ్య శ్రీ లుక్స్ బాగున్నాయి. మరి ఈ సినిమాతో అయినా హిట్టు కొట్టి.. టాలీవుడ్లో నిలబడుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.