ఎన్నికలు జరిగి ఏడాది తిరక్కుండానే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ కి ఒక ఛాలెంజ్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. ఆ ఆరోపణలు తప్పని తేలితే.. జగన్ రాష్ట్ర యువతకు క్షమాపణ చెబితే సరిపోతుందన్నారు. ఈ ఛాలెంజ్ వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జగన్ చేసిన ఆరోపణలు ఏంటి..? లోకేష్ అంత గట్టిగా ఎందుకు రియాక్ట్ అయ్యారు..?
ఎకరం రూపాయి..
విశాఖ పట్నంలో ఉర్సా అనే కంపెనీకి ఎకరం రూపాయికి లీజుకి ఇచ్చారనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి ఆధారాలేవీ చూపించడం లేదు కానీ.. రూపాయి లీజు అనేది ఏపీలోనే హాట్ టాపిక్ అయింది. రూపాయికి విశాఖలో ఇడ్లీ వస్తుందో రాదో తెలియదు కానీ ఎకరం పొలం వచ్చేస్తుందంటూ వైసీపీ.. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. జగన్ కూడా పలుమార్లు ఇదే విషయమై ప్రభుత్వాన్ని వెటకారం చేస్తూ మాట్లాడారు. విశాఖలో రూపాయికి ఇడ్లీయే రాదని అలాంటిది, కూటమి ప్రభుత్వం ఎకరం కట్టబెడుతోందని విమర్శించారు. ఈ విమర్శలను కొన్నిరోజులుగా కూటమి ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. అయితే ఈ ప్రచారం ఎక్కువ కావడంతో చివరకు లోకేష్ రంగంలోకి దిగారు. ట్విట్టర్ వేదికగా జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
Challenge No. 1@ysjagan గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా… pic.twitter.com/2fJos6TNle
— Lokesh Nara (@naralokesh) June 2, 2025
వివరాలు ఇవీ..
ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని చెప్పుకొచ్చారు లోకేష్. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు. నిజాలు ఇలా ఉంటే.. వైసీపీ మాత్రం ఎకరం రూపాయికేనంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ జగన్ కి సవాల్ విసిరారు లోకేష్. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారూ..? అంటూ ట్వీట్ వేశారు.
ఈనో తాగండి..
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని విమర్శించారు లోకేష్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని.. ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామన్నారు లోకేష్. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నట్టు చెప్పారు. ఏపీకి కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఇక చివరిగా ఓ పంచ్ డైలాగ్ తో తన ట్వీట్ ముగించారు లోకేష్. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది అంటూ సెటైర్లు పేల్చారు. లోకేష్ ట్వీట్ కి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. అయితే లోకేష్ మరీ ఘాటుగా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసరడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. మరి ఈ ట్వీట్ కి జగన్ స్పందిస్తారా..? ఉర్సా కంపెనీకి అప్పగించిన భూముల వివరాలతో ప్రజల ముందుకొస్తారా..? వేచి చూడాలి.