ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడం కంటే.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో విజయవాడకు చేరుకోవడం సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక డిమాండ్లను లేవనెత్తారు.
కనెక్టివిటీ సమస్యలు గురించి ఏమన్నారంటే..?
ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరం నుండి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని.. అంత దూరం ప్రయాణించి విమానం ఎక్కడం కంటే రైలు ప్రయాణమే ఉత్తమమని ఆయన విశ్లేషించారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి అదనంగా మరో రెండు వందే భారత్ రైళ్లను కేటాయించాలని తాను ఇప్పటికే కోరినట్లు వెల్లడించారు.
వైజాగ్ ఎయిర్ పోర్టును కొనసాగించాలి.
భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చాక.. ప్రస్తుతం నగరంలో ఉన్న విశాఖపట్నం ఎయిర్ పోర్టును మూసివేయాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వైజాగ్ ఎయిర్ పోర్టును యథావిధిగా కొనసాగించాలి. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ విమానాశ్రయాన్ని మూసివేయడం సరైన నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మూసివేత ఆలోచన ఉంటే.. దానిపై ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్ చేశారు.
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం..
అంతర్జాతీయ విమానాశ్రయం రావడం మంచిదే అయినప్పటికీ.. అది సామాన్య ప్రయాణికులకు భారంగా మారకూడదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో మెరుగుపడకుండా పాత ఎయిర్ పోర్టును మూసివేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఈ విషయంలో పునరాలోచించాలని.. విశాఖ అభివృద్ధికి ఆటంకం కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
ALSO READ: CP Sajjanar: సైబర్ బాధితుల కోసం ‘సైబర్ మిత్ర’.. ఇక ఇంటి నుంచే ఫిర్యాదు చేసుకోవచ్చు..