Amaravati Mock Assembly: అమరావతిలో విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. మాక్ అసెంబ్లీ కార్యక్రమం బుధవారం ఉదయం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమం, భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే వేదికగా నిలవడం విశేషం.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రభుత్వ పాలసీలపై అవగాహన ఉండేలా.. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షల నిర్వహణ ద్వారా మాక్ అసెంబ్లీకి విద్యార్ధులను ఇటీవల ఎంపిక చేశారు. నిజమైన అసెంబ్లీ తరహాలో విధానాలు, చర్చలు, బిల్లులు, తీర్మానాల ఆమోదం వంటి దశలను అనుభవించేలా ప్రత్యేక రూపకల్పన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ‘సంవిధాన్ దివస్’ – రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది.
మాక్ అసెంబ్లీ ప్రారంభంతోనే స్పీకర్ ఎంపిక ప్రక్రియ జరిగింది. కోడూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వరి రెడ్డి, కాకినాడకు చెందిన స్వాతి పేరును అసెంబ్లీ స్పీకర్గా ప్రతిపాదించగా, తాడేపల్లికి చెందిన ఎమ్మెల్యే పి. ఆంజనేయులు కుమార్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం, స్వాతి ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించడంతో సభలో చప్పట్ల నినాదాలు మార్మోగాయి.
స్పీకర్ను అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి సభావేదిక వద్దకు ఆహ్వానించడం.. విద్యార్థుల్లో ఉన్న పరిపక్వతను చూపించింది.
మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యా శాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకరుగా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లలను ప్రవేశపెట్టి కాసేపు చర్చించనున్నారు.
Also Read: బ్యాంక్లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నీచర్..
కాగా సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు, విద్యార్ధి పర్యావరణ పరిరక్షణ బిల్లు, డ్రగ్స్ నయంత్రణ వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్ధులు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.