Tobacco Farmers: ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి పెరగడం, అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వారిని గట్టెక్కించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ తీపి కబురు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో గంటపాటు మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు.
రైతులకు అందనున్న ప్రధాన ప్రయోజనాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి పొగాకు రైతులకు ఊరటగా ‘బోన్’ ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికీ రూ. 50,000 చొప్పున రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నారు. పొగాకు రైతులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం వెంటనే రూ. 105 కోట్ల నిధులను కేటాయించింది. రైతులు విక్రయించే ప్రతి కేజీ పొగాకుపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 చొప్పున అదనపు సాయం ఇస్తుంది. ఈ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ అవుతాయి.
త్వరలోనే కొనుగోళ్లు పూర్తి
రాబోయే రెండు నెలల్లోగా రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేలా చర్యలు వేగవంతం చేశారు. రేపటి నుంచే ఈ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు ప్రారంభం కానున్నాయి. పొగాకు బోర్డు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాపారులు అందరూ కలిసి రైతులకు అండగా నిలిచేలా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు
గతంలో వైసీపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఐదేళ్ల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే కొనుగోళ్లు జరిగిందన్నారు. ఇప్పుడు పొగాకు రైతుల సమస్యలను అనవసరంగా రాజకీయం చేయడానికి చూస్తున్నారని పెమ్మసాని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గతేడాది కూడా రైతులను ఆదుకుందని, ఈ సారి కూడా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తుందని స్పష్టం చేశారు.
Also Read: ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసిన మహిళ, అసలు విషయం తెలిస్తే షాక్, అనంతలో దారుణం