నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది.
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణించి రేపు మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
ఈ జిల్లాల్లో వర్షం..
వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి:
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి: ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
బాపట్ల, పల్నాడు, ప్రకాశం: ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
రాయలసీమ: రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా తుంపర్లు లేదా స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..
తీవ్ర వాయుగుండం దృష్ట్యా సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. వర్షాలు కురిసే సమయంలో పాత భవనాల్లో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని కోరారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ALSO READ: TATA Cars Discounts Jan 2026: టాటా జనవరి డిస్కౌంట్స్, ఆ కార్లపై ఏకంగా రూ. 85 వేల తగ్గింపు!