Rains Vs High Temperatures In AP: నైరుతి రుతుపవనాలు దక్షిణ భారత్ అంతటా విస్తరిస్తున్నాయి. పశ్చిమ-మధ్య, ఈశాన్య-వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో వింత వాతావరణం.. ఓ వైపు వర్షాలు-ఇంకోవైపు భానుడి ప్రతాపం
రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.
రాయలసీమలోని పలు జిల్లాలను రుతుపవనాలు తాకాయి. రెండు రోజుల్లో రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటక నుంచి కోస్తాంధ్ర తీరం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో సోమ-మంగళవారాల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
సోమ-మంగళవారాల్లో అలర్ట్ సూచనలు- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షం వచ్చే సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఏపీలోకి 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.
ALSO READ: టీడీపీ వీరాభిమాని సత్యనారాయణ కోరిక.. కలుద్దామని సీఎం చంద్రాబాబు ట్వీట్
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భానుడి ప్రతాపం అధికంగా ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితి అయితే తప్పితే బయటకు వెళ్లవద్దని తెలిపింది. ఒకవేళ వెళ్లే సమయంలో చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా కండువా టోపీ వంటివి ధరించాలని సూచన చేసింది.