Food Poisoning: పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం సోములగూడం బాలికల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో వడ్డించిన ఆహారం వికటించి 20 మందికి పైగా విద్యార్థినులు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే బాలికలకు వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా వైద్యం..
అర్థరాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పటికీ, పాఠశాల సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి గానీ, ఆస్పత్రికి గానీ తీసుకువెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల లోనే చికిత్స అందించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి విషమించి, ఒక్కొక్కరిగా విరోచనాలతో తీవ్ర ఇబ్బంది పడటంతో ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఆస్పత్రులకు బాధితుల తరలింపు
సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్సుల ద్వారా బాధితులను ఆస్పత్రులకు తరలించారు. వీరిలో 8 మంది విద్యార్థినులను వి.ఆర్.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరో 11 మందిని మెరుగైన వైద్యం కోసం చింతూరు ఏరియా ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం బాలికలకు వైద్యులు సమగ్ర చికిత్స అందిస్తున్నారు.
అధికారుల విచారణ
ఈ ఘటనపై చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నౌక్వాల్ తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించారు. ఆహారం ఎక్కడ పాడైంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read: అంబటితో వేదిక పంచుకున్న బోండా ఉమా.. చంద్రబాబు రియాక్షన్ చూస్తే మైండ్ బ్లాకే!