Botsa Satyanarayana: విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యావ్యవస్థ, డీఎస్సీ నియామకాలు, విద్యాదీవెన, భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ తదితర కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీ, విద్యావ్యవస్థపై విమర్శలు
డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని బొత్స మండిపడ్డారు. కేంద్రంలో నీట్ పరీక్షల లీకేజీల సమయంలోనూ ఇలాంటి కబుర్లే చెప్పారని, ఇప్పుడు ఇక్కడా అదే పునరావృతమవుతోందని అన్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట నచ్చిన వ్యక్తులకు డీఎస్సీ ఉద్యోగాలు కట్టబెట్టారని, నియామకాలు పూర్తయ్యాక ఆ జీవోను రద్దు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ‘నాడు-నేడు’ ద్వారా రూపురేఖలు మారిన పాఠశాలలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి వచ్చిందని, ఇది రాష్ట్రానికి తీవ్ర అప్రతిష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాదీవెన, నిరుద్యోగ భృతి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విద్యాదీవెన పథకాన్ని తర్వాతి ముఖ్యమంత్రులంతా కొనసాగించారని బొత్స గుర్తుచేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో బకాయిలు చెల్లిద్దామంటే ఎన్నికల కోడ్ను సాకుగా చూపి కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది ప్రస్తుత పాలకులేనని మండిపడ్డారు. ఆ బకాయిలను తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందా లేదా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా అని నిలదీస్తూ, విద్యార్థులను, నిరుద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిజాలు
విభజన చట్టం ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్కు కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఆనాడు చంద్రబాబు 15 వేల ఎకరాలు, ఆ తర్వాత 5 వేల ఎకరాలు లాక్కోవాలని చూస్తే తాము పోరాటం చేశామని బొత్స తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక భూమిని 2203 ఎకరాలకు కుదించి నిర్మాణం వేగవంతం చేశామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ సరిగా చేయలేకపోయిన వీరు క్రెడిట్ తీసుకోవాలని చూడటం విడ్డూరమన్నారు. ప్రధాని మోదీ పర్యటన ముగిశాక భోగాపురంలో భారీ సభ పెట్టి అసలు వాస్తవాలను ప్రజల ముందుంచుతామని ప్రకటించారు.
అశోక్ గజపతిరాజుకు హితవు
విజయనగరం వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ స్థలం విషయంలో అశోక్ గజపతిరాజు జోక్యం చేసుకోవడం తగదని బొత్స అన్నారు. ‘గురివింద గింజ సామెత గుర్తుంచుకొని మీ గౌరవాన్ని కాపాడుకోండి’ అని హితవు పలికారు. గతంలో మాన్సాస్ సంస్థను నడపలేమని అప్పటి చైర్మన్ ఆనంద గజపతిరాజు ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయం వంద శాతం నిబంధనల ప్రకారమే లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వాలు పార్టీలకు, స్వచ్ఛంద సంస్థలకు భూములు ఇవ్వడం సాధారణమైన ప్రక్రియేనని స్పష్టం చేశారు.
Also Read: 13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!