Chandrasekhar Reddy: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో విపరీతమైన అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నాపత్రంలో తీవ్ర తప్పులు..
ప్రశ్నాపత్రం తయారీ నుండి ఫలితాల వెల్లడి వరకు ప్రతి దశలోనూ నిబంధనలను పక్కనబెట్టారని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్లో ఏకంగా 17 తప్పులు దొర్లాయని, ఒకే ప్రశ్నకు పలు సమాధానాలు ఇవ్వడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 0.1 మార్కు తేడాతో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి న్యాయం జరగలేదని దుయ్యబట్టారు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినప్పటికీ.. అసలైన అర్హులకు ఉద్యోగాలు దక్కలేదని స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ డీఎస్సీలో అక్రమాల పర్వం
స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 384 పోస్టుల భర్తీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ ఆరోపించారు. చెల్లుబాటు కాని నకిలీ సర్టిఫికేట్లు, సంబంధం లేని క్రీడల బ్యాకప్ పత్రాలను ఆమోదించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. చివరికి ఒకరి పత్రాలకు మరొకరి బ్యాకప్ ఆధారాలను జత చేసినా అధికారులు అంగీకరించడం గమనార్హమన్నారు. చివరికి కనీసం టెట్ అర్హత కూడా లేని వారికి టీచర్ పోస్టులు ఇచ్చి ప్రభుత్వం తమ నోటిఫికేషన్ను తామే ఉల్లంఘించిందని పేర్కొన్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజీపై అనుమానాలు
ఎస్సీఈఆర్టీలో పనిచేసిన నవీన్ అనే వ్యక్తికి టాప్ ర్యాంకులు రావడం వెనుక ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్ర దాగి ఉందనే బలమైన అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపితే అసలు నిజాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. తాము వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయలేదని, కేవలం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకుని మళ్లీ కొత్తగా దాఖలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే గవర్నర్కు ఆధారాలతో కూడిన వినతిపత్రం ఇచ్చామని చెప్పారు.
సీబీఐ విచారణే శరణ్యం
తప్పు చేయనప్పుడు ఈ అవినీతిపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఏళ్లనాటి కష్టాన్ని నీరుగార్చి తమకు కావాల్సిన వారికి పోస్టులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ‘దగా డీఎస్సీ’పై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ అర్హులైన అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: డీఎస్సీ లీకులు.. విద్యాదీవెనకు దిక్కులేదు.. కూటమి పాలనపై బొత్స సంచలన కామెంట్స్!