APPSC : ఆంధ్ర ప్రదేశ్లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17 అర్ధరాత్రి 11.59గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని.. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్ 2 పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని.. వాటిని సరిచేయాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది ఏపీపీఎస్సీ.
మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ముందుగా డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో తెలపింది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు ఇబ్బంది పడడంతో.. గడువును జనవరి 17వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.