APPSC Group 1 Results: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 మందితో తుది జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. కోర్టు వివాదాల కారణంగా రెండు స్పోర్ట్స్ కోటా పోస్టులను పెండింగ్లో పెట్టింది. సీటీవో, డీఎస్పీ సివిల్ పోస్టులకు మినహా మిగిలిన పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో హాల్టికెట్ నంబర్లతో అభ్యర్థులు జాబితాను చూడవచ్చు.
2023లో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 8 క్యారీ ఫార్వార్డ్ పోస్టులు యాడ్ చేశారు. 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మే నెలలో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. గతేడాది జూన్లో మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు 185 మందిని ఎంపిక చేశారు. వీరిలో నలుగురు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులున్నారు. తాజాగా రెండు స్పోర్ట్స్ కోటా పోస్టుల మినహా.. 87 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. బీసీ-ఈ కేటగిరీ అభ్యర్థుల ఎంపికపై కోర్టులో కేసు విచారణలో ఉంది. కోర్టు తీర్పు ఆధారంగా స్పోర్ట్స్ కోటా పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇటీవల గ్రూప్-2 ఫలితాల్లో ఎంపికైన పలువురు అభ్యర్థులు గ్రూప్-1లోనూ ఉద్యోగాలు సాధించారు. తెలంగాణ గ్రూప్-1లో డీఎస్పీ ఉద్యోగం సాధించిన సుదర్శన్ ఏపీపీఎస్సీ గ్రూప్-1లోనూ డీఎస్పీగా ఎంపికయ్యారు. గుడివాడ మున్సిపల్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ నాగేంద్ర.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ జాబ్ సాధించారు. గుంటూరుకు చెందిన అక్కా చెల్లెళ్లు గ్రూప్స్లో విజయం సాధించారు.
Also Read: ఏపీపీఎస్సీ అటవీ శాఖ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
అక్క ప్రియాంక గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపిక కాగా, చెల్లి సాహితి గ్రూప్-2లో రోడ్లు, భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. రెండు రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలు సాధించడంతో…వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారి తండ్రి వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి స్వర్ణలలిత జీజీహెచ్లో కౌన్సిలర్గా పనిచేసి ఇటీవల బదిలీ అయ్యారు.