Anakapalli News: యువతకు ఉపాధి అవకాశాలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ చేసింది. ఇప్పటివరకు భూములు కేటాయించిన కొన్ని సంస్థలు భూమిపూజకు చేశాయి.. మరికొన్ని చేస్తున్నాయి. ఆ జాబితాలోకి ఆర్సెలాల్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ప్లాంట్ చేరిపోయింది. వచ్చేవారంలో రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించే భారీ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీని హాజరయ్యే అవకాశముందని సమాచారం.
మార్చి ఏడున ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్ప్లాంట్కు భూమి పూజ
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో అతి పెద్ద స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాయి ఆర్సెలాల్ మిట్టల్-నిప్పన్ సంస్థలు. దీనికి సంబంధించి ఆయా సంస్థలకు ప్రభుత్వం భూమి కేటాయించింది. నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామం సమీపంలో ప్రతిష్టాత్మక స్టీల్ప్లాంట్కు మార్చి 7న భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్రమంత్రులు, అలాగే రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహేన్ సిన్హా. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏఎంఎన్ఎస్ యాజమాన్యం శంకుస్థాపనకు సంబంధించిన వివరాలను ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ పేర్కొంది. శంకుస్థాపనకు సంబంధించి కంపెనీ ఫోటోతో పాటు, గూగుల్ మ్యాప్, ఇతర వివరాలు ప్రస్తావించింది. ఇటీవల స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని ఆ జిల్లా అధికారులు పరిశీలించారు. దేశంలో అతిపెద్ద స్టీల్ప్లాంట్ ఇది. దాదాపు రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేస్తున్నాయి ఆయా సంస్థలు. పరిశ్రమను రెండు దశల్లో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. తొలిదశలో 2,200 ఎకరాలు కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్లాంట్ తొలిదశ ప్రాజెక్టు పురోగతిని బట్టి రెండోదశకు అవసరమైన భూసేకరణ చేయనుంది. ఆర్సెలాల్ మిట్టల్-నిప్పన్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందడుగు పడబోతోంది.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశం
పూర్తిస్థాయిలో ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రతీ ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుంది. మొదటి దశలో దాదాపు రూ. 61 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అందుకోసం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనులు ప్రారంభం కానున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పించనుంది. గత జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు చర్చలు జరపడంతో ఈ ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడ్డాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం ఒకటైతే, ఎగుమతి, దిగుమతులకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా మారనుంది. ప్లాంట్ రాకతో అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్ నెట్వర్క్ అభివృద్ధి చెందనుంది. దీనిద్వారా ఏపీ పారిశ్రామిక హబ్గా మారనుంది.
ALSO READ: జగన్ టీమ్ లోకి ఇద్దరు యోధులు.. ఇక కూటమి ప్రభుత్వానికి కష్టాలే?