పంచాయితీ ఎన్నికల వేళ వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు మహిళా ఓటర్లకు చీరల పంపిణీ చేపట్టగా.. దీనిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పాన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత రమేష్ రెడ్డి ఇంటి వద్ద గులాబీ కేడర్ పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. బీఆర్ఎస్ నేత తిరుపతి రెడ్డి దౌర్జన్యానికి దిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
రమేష్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు ఐదు వేల చీరలు నిల్వ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టపగలే చీరల పంపిణీకి ప్రయత్నించడంతో రాజకీయ రగడ తీవ్రంగా మారింది.