Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాలపై బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (Bengaluru civil court) తీవ్రంగా స్పందించింది. పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా ఉన్న దుష్ప్రచార కంటెంట్ను, సంబంధిత లింకులను తక్షణమే బ్లాక్ చేయాలని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) సంస్థలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ప్రాంతంలో గల కోడి చెరువు భూములను పవన్ కళ్యాణ్ ఆక్రమించారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కథనాలు, వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. అయితే తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అరుణ్ శ్యామ్ వాదనలు వినిపించారు. పవన్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి వెంటనే అడ్డుకట్ట వేసేలా తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు లాయర్ విన్నవించారు.
వాదనల అనంతరం బెంగళూరు సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ మెుహమ్మద్ మెయినుద్దీన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కల్యాణ్పై ఎలాంటి అవమానకరమైన, నిరాధారమైన వ్యాసాలు, వార్తలు, ఆరోపణలు లేదా వీడియోలను ప్రసారం చేయకూడదని, అప్లోడ్ చేయకూడదని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ఉన్న ఇటువంటి కంటెంట్ను తొలగించి.. ఎవరూ షేర్ లేదా రీ-పబ్లిష్ చేయకుండా నియంత్రించాలని ఎక్స్, మెటా, గూగుల్ ను కోర్టు ఆదేశించింది.
Also Read: వర్షాకాలం స్పెషల్.. ఏసీలో ‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?
ఈ క్రమంలోనే పవన్ తరపున సీనియర్ న్యాయవాది డాక్టర్ అరుణ్ శ్యామ్ వాదనలు వినిపిస్తూ.. కోర్టుకు కొన్ని నిర్దిష్టమైన యూఆర్ఎల్లు (URLs), సోషల్ మీడియా లింకులను సమర్పించారు. వీటి ద్వారానే పవన్ కల్యాణ్పై తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం, సదరు 12 వివాదాస్పద లింకులను వాటికి సంబంధించిన కంటెంట్ను తమ ప్లాట్ఫారమ్ల నుండి తక్షణమే తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేదంటే వెంటనే బ్లాక్ చేయాలని ఎక్స్, గూగుల్, మెటాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: అద్దె ఇంట్లో ఏసీలు, గీజర్లు పెట్టొచ్చా? యజమాని అనుమతి లేకుండా.. చేయగలిగే మార్పులివే!