Bhogapuram Airport: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెట్టుకున్న టార్గెట్కు ముందుగా పనులు పూర్తి అవుతున్నాయి. ఓవైపు రాజధాని అమరావతి.. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు.. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు పనులు జెట్ వేగంతో సాగుతున్నాయి. తాజాగా జులై చివరి నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులు 84 శాతం పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా ప్రకటించారు.
ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి రాకపోకలు సాగించాలని భావిస్తోంది. 12 నుంచి 14 నెలల్లో పెండింగ్ పనులు పూర్తి కానున్నట్లు ఓ అంచనా. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు జీఎంఆర్ ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం పది నెలల్లో పనులు పూర్తి చేయాలని కోరారు.
ఇచ్చిన గడువు కంటే ముందు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ పనుల్లో జోరు పెంచింది. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి దాదాపు 32 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జులై నెలాఖరుకు 84 శాతం పనులను పూర్తి చేయడం గమనార్హం. ఈ లెక్కన అక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
కూటమి నేతలు మే చివరి నాటికి అంటే మహానాడుకు ముందే రాకపోకలు సాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న జోరు కంటిన్యూ అయితే ముందుగానే కావచ్చని అంటున్నారు. రెండు దశల్లో విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. తొలి దశ రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మాణాలు సాగుతున్నాయి. అందులో 22 ఏరో వంతెనలు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ ఉన్నాయి.
ALSO READ: గుడ్ న్యూస్.. ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గింపు
2,203 ఎకరాల్లో విమానాశ్రయం ఉండనుంది. ఇతర అవసరాలకు మరో 500 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. అంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవుతో రెండు రన్వేలు నిర్మిస్తున్నారు. ఒకటి రన్ వే దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రయాణించే ట్రావెలర్ల సంఖ్య అంచెలంచెలుగా పెంచేలా చేస్తోంది.
2030 నుంచి రెండోదశ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఇదే సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బీచ్ కారిడార్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. విశాఖపట్నం సిటీ నుండి భోగాపురం ఎయిర్పోర్టుకు కేవలం 45 నిమిషాలు చేరుకునేలా వీలు కల్పిస్తుంది ఈ ప్రాజెక్టు. దీనికి సంబంధించి రహదారి విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్ రెడీ అయ్యింది.
విశాఖ పోర్టు మొదలు భీమిలి, గోస్తనీ నది మీదుగా భోగాపురం చేరుకునేలా రూపొందించిన ప్రాజెక్టు. ఎయిర్పోర్టు అయ్యేలోపు బీచ్ కారిడార్ పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. విమానాశ్రయం ఓపెన్ అయ్యేనాటికి బీచ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు వేగంగా విశాఖ నగరానికి చేరుకోవచ్చని భావిస్తోంది.
ఎయిర్ పోర్టుకు నాలుగువైపులా గుర్తించిన 15 అంతర్గత రోడ్లు విస్తరించి కనెక్టివిటీ పెంచాలని విశాఖ మహా నగరపాలక సంస్థ నిర్ణయించింది. వాటిని నాలుగు వరుసల రోడ్లుగా మార్చితే భోగాపురం రావడానికి ఈజీ అవుతుంది. విజయనగరం రింగ్రోడ్డు-ఐనాడ జంక్షన్, దొరతోట, కాపులుప్పాడ, మద్దిలపాలెం, శొంట్యాం, అడవివరం, బోయపాలెం, షీలానగర్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు కీలకం కానున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.390 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. దీనికోసం రూ. 174.64 కోట్ల తో టెండర్లు పిలిచింది.