Kolikapudi: తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, స్థానిక రాజకీయ వర్గాల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య ఉన్న పాత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగించేలా కేకలు, అరుపులతో వైసీపీ నేతలు హల్ చల్ చేశారు.
ఇదే సమయంలో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో పెద్దఎత్తున వైఎస్ జగన్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మరో వివాదానికి కారణమైంది. దీనిపై స్పందించిన పోలీసులు తిరువూరు నియోజకవర్గ వైసీపీకి చెందిన 20 మంది నాయకులపై కేసు నమోదు చేశారు.
హాస్పిటల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఒకచోట చేరడం, రోగులు, ఆసుపత్రి సిబ్బందికి ఇబ్బంది కలిగించడం వంటి అంశాలపై కేసులు నమోదు అయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన తిరువూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ప్రభుత్వాసుపత్రి కమిటీ చైర్మన్ గా కొలికపూడి కొడుకే ఉన్నారు. దీంతో ఆయన కనుసన్నల్లోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారని ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, కొలికపూడి కొడుకు ఆదేశాలతోనే అధికారులు మౌనం వహిస్తువ్నారని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనతో కొలికపూడి, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలోనూ పలు సందర్భాల్లో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో సాగిన సంగతి తెలిసిందే. తాజా ఘటన ఆ విభేదాలను మరింత ముదిరేలా చేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read: మంత్రులతో సీఎం కీలక భేటీ.. చర్చించే అంశాలివే..
మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వరుసగా వివాదాలు చోటుచేసుకోవడం, ప్రభుత్వంపై ప్రతికూల ప్రచారం రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని సమాచారం. ఈ ఘటనపై అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.