Bird Flu Alert: సీజన్ మారగానే బర్డ్ ఫ్లూ భయం ఏపీని వణికిస్తోంది. వేలల్లో కోళ్లు మృత్యువాత పడటంతో కలకలం రేపుతోంది. దాదాపు 28 వేల కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో యంత్రాంగం ఉలిక్కి పడింది. ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేలా మూడు కోళ్ల ఫారాలను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు.
ఏపీలోని ఆ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ పంజా, 28 వేల కోళ్లు మృతి
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ కేసులు నిర్ధారించిన తర్వాత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పశు వైద్య బృందాలను నియమించారు. రైతులు, సాధారణ ప్రజలు దీనికి భయపడాల్సిన అవసంలేదని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పౌల్ట్రీ రంగంలో బర్డ్ ఫ్లూ వ్యవహారం కలకలం రేపుతోంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో సదుం మండలంలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పౌల్ట్రీ రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగిన అధికారులు, వైరస్ ఎఫెక్ట్ ఉన్న మూడు కోళ్ల ఫారాలు సీజ్ చేశారు.
అలర్టయిన అధికారులు, మూడు పౌల్ట్రీలు క్లోజ్
చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. కోళ్ల ఫారాల్లో వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. ఈ విషయం తెలియగానే అలర్టయిన స్థానిక పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రాథమిక పరీక్షలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తేలడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.
మూడు కోళ్ల ఫారాల్లో దాదాపు 28 వేల కోళ్లు ఈ వైరస్ బారిన పడి మరణించాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైరస్ మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా కఠిన చర్యలు చేపట్టారు అధికారులు. బతికున్న కోళ్లను నిర్మూలించే ప్రక్రియను మొదలుపెట్టారు. మరణించిన కోళ్లను ఊరి బయట జేసీబీ సాయంతో భారీ గుంతలు తీసి పూడ్చి వేస్తున్నారు.
ALSO READ: తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూపై ఈడీ ఫోకస్.. నిధుల గుట్టు తేల్చేందుకు
వ్యాధి ప్రబలిన మూడు కోళ్ల ఫారాలను సీజ్ చేసినట్టు ఎమ్మార్వో వెల్లడించారు. ఆ ప్రాంతంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కోళ్ల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దని సూచించారు. సదుం గ్రామం వెలుపల కోళ్ల మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. రెండు ఫామ్లలో పాజిటివ్ కేసులను నిర్ధారించిన అధికారులు, అందుకు తగినట్టుగా చర్యలు చేపట్టారు.
కంబంవారిపల్లె గ్రామానికి సంబంధించి ఫలితం రావాల్సి ఉంది. బర్డ్ ఫ్లూపై వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని తెలిపారు. సగం వండిన మాంసం, గుడ్లు తినవద్దని సూచించారు. కార్వేటినగరం మండలంలో కోళ్ల మరణాలు సంభవించిన నేపథ్యంలో అక్కడి నమూనాలను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పంపించారు.