Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి నేతల భాష, వారి ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలు సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
కోటి సంతకాల సేకరణ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను బొత్స విచిత్రంగా అభివర్ణించారు. ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? జనంలోకి వెళ్లి అడిగితే మెడికల్ కాలేజీల కోసం ఎంతమంది సంతకాలు చేశారో స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని, అప్పుడు ప్రజలే సరైన సమాధానం చెబుతారని సవాల్ విసిరారు.
మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని, ప్రజారోగ్యాన్ని స్వలాభం కోసం వాడుకునే వారిపై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, కనీసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తారో, సస్తారో పక్కన పెడితే ఉపాధి హామీ పథకం పూర్తిగా అటకెక్కింది. ఇలా కొనసాగితే రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. మళ్లీ వలసలు మొదలవుతాయి, పేదలకు అన్నం దొరకని పరిస్థితి వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం డిప్యూటీ సీఎం శాఖ పరిధిలోనే ఉంటే.. కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు పేదలు అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కూడా అవసరం లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బొత్స ఆరోపించారు. హాస్టళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం సరిగా దొరకడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాల కంటే ముందు భోజనం, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు.
యూరియా కొరతపై కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే ఏపీలోనే యూరియా కొరత ఎందుకు వచ్చింది? మిగతా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రపై చంద్రబాబు, ఆయన టీమ్ కన్ను పడిందని, అక్కడ భూములు దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయించడం ఎక్కడైనా ఉందా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా భూ కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అన్ని భూ కేటాయింపులను తిరగదోడుతామని స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాల్లో పేకాట క్లబ్బులు, పోర్టుల వద్ద అక్రమ రవాణా జరుగుతోందని, రాష్ట్రంలో నిజంగా ఎన్డీయే ప్రభుత్వం ఉందా లేక వైసీపీ ప్రభుత్వం ఉందా అని డిప్యూటీ సీఎంను సూటిగా ప్రశ్నిస్తున్నానని బొత్స అన్నారు.
Also Read: గర్భిణిపై వైసీపీ మూక దాడి.. మంత్రి లోకేష్ ఆగ్రహం
రూ.2.66 లక్షల కోట్ల అప్పులు చేసి, విద్యా–వైద్య రంగాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.