Budda Venkanna: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డికి ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను విమర్శిస్తూ ముద్రగడ రాసిన లేఖపై వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ముద్రగడ గారూ, మీ తండ్రి గారు మీకు అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడమని చెప్పారా?” అని ఆయన నేరుగా ప్రశ్నించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తల్లిని, భార్యను గత ప్రభుత్వ హయాంలో దూషించినప్పుడు ముద్రగడకు కులం ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు.
మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుండి చిత్తూరుకు ఈడ్చుకెళ్లినప్పుడు ఆయన కాపు సామాజిక వర్గం వ్యక్తిగా మీకు అనిపించలేదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. గతంలో కిర్లంపూడిలో ముద్రగడకు అండగా నిలిచింది గవర సామాజిక వర్గమేనని గుర్తు చేస్తూ, అదే సామాజిక వర్గానికి చెందిన తనపై మాచర్లలో దాడి జరిగినప్పుడు ముద్రగడ ఎందుకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “1994లో మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు, 1999లో చంద్రబాబు గారే మిమ్మల్ని పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపిన విషయం నిజం కాదా?” అని ముద్రగడను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఆనాడు చంద్రబాబు గొప్ప వ్యక్తని కొనియాడిన ముద్రగడ, ఇప్పుడు అదే వ్యక్తిపై అసూయ పెంచుకోవడం సరికాదని హితవు పలికారు.
చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీ లోపల, బయట అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు లేఖ రాయలేదని వెంకన్న ప్రశ్నించారు. అంబటి రాంబాబు వాడిన బూతులను, జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై చేసిన దాడిని ముద్రగడ సమర్థిస్తున్నారా అని ఆయన నిలదీశారు. చంద్రబాబుపై ముద్రగడకు ఉన్న ద్వేషం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేవలం ఒక కులానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని, ఆయన ప్రపంచ దేశాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన నాయకుడని వెంకన్న కొనియాడారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతోనే మళ్లీ ముఖ్యమంత్రిని చేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. “మీరు ఎంతలా అసూయ పడితే చంద్రబాబు గారు అంతలా ఎదుగుతారు” అని ముద్రగడను హెచ్చరించారు. ఇకనైనా లేఖల్లో కేవలం అసూయను ప్రదర్శించకుండా, వాస్తవాలను రాస్తే బాగుంటుందని ముద్రగడ పద్మనాభంకు బుద్దా వెంకన్న సూచించారు.
Read Also: అంబటి ఓ టిష్యూ పేపర్.. జగన్ వాడుకొని పాడేస్తాడు.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు