AP MGNREGA funds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. గ్రామీణ ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ. 1192.16 కోట్లను మంజూరు చేసింది కేంద్రం.
మెటీరియల్ కంపోనెంట్కు రూ. 1123.15 కోట్లు కేటాయించగా అడ్మిన్ కంపోనెంట్ కోసం మరో రూ. 69.01 కోట్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. ఇవి కేవలం అంకెలు కాదని లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా అని పేర్కొన్నారు. కూలీలకు వేతనాలు నేరుగా అందేలా పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని.. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్ల ఈ నిధులు నేరుగా గ్రామస్థాయిలో ఫలితాలను చూపిస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తోందని పెమ్మసాని కొనియాడారు. ప్రతి గ్రామానికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ భారీ నిధుల విడుదల ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Also: బీఆర్ఎస్లో ముగిసిన వారసత్వ పోరు.. ఇక అన్నీ రాము చూసుకుంటాడు: కేసీఆర్!