Chandrababu Govt: ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీపై ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ఇందులో భాగంగా నిరుపేదలకు భూములు మంజూరు చేసేందుకు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో జిల్లాల వారీగా అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జిల్లాలో ఖాళీగా ఉన్న భూములను రెవెన్యూ శాఖ సిఫాసుల మేరకు ఈ కమిటీ పరిశీలించనుంది. అర్హులైన పేద లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. మాజీ సైనికులకు ఇచ్చే భూములను సైతం ఈ కమిటీ ఖరారు చేయనుంది.
జిల్లా స్థాయి కమిటీలు
ఏపీలో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. సంబంధిత జిల్లాకు చెందిన మంత్రులు, ఆర్డీఓ, సబ్ కలెక్టర్లు సభ్యులు ఉంటారు. కలెక్టర్ కేవలం కన్వీనర్గా మాత్రమే ఉంటారు. అలాగే ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు.
ఇటీవల ఏపీ సర్కార్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసింది. అందులో భూముల వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అసైన్డ్ భూములను లబ్దిదారుల నుంచి అక్రమంగా బదలాయించినట్టు ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో నిషేధిత-22 A జాబితా నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఇనాం భూములు మొత్తం 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 13.57 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెరిఫై చేయించింది.
అసైన్డ్ భూములను కొంతమంది ఉద్దేశపూర్వకంగా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పేదవాడికి ఎలాంటి అన్యాయం జరుగకుండా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. భూములు అన్యాక్రాంతం కాకుండా, పారిశ్రామిక అవసరాలకు, నిరుపేదల ఇళ్ల స్థలాలకు ఈ భూములను వినియోగించే విధంగా చర్యలు చేపట్టనుంది.
ALSO READ: ఇకపై పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
వైసీపీ హయాంలో భారీ ఖర్చు
గత వైసీపీ హయాంలో భారీగా ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి సుమారు 20-25 లక్షల ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. అయితే ఇంటి స్థలాల కోసం సేకరించిన భూమి భారీ అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. జిల్లా స్థాయి కమిటీల ద్వారా భూమి కేటాయింపును చేపట్టాలని నిర్ణయించారు.
ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు భూమి లేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీని పునరుద్ధరించాలని భావిస్తోంది ప్రభుత్వం. భూమి అందుబాటులో లేకపోవడం వల్ల భూమి లేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ చాలా సంవత్సరాలుగా నిలిచిపోయింది. రీసర్వే తర్వాత ప్రభుత్వం భారీ మొత్తంలో భూమిని తీసుకోవచ్చన్నది ప్రభుత్వం వర్గాల మాట.
ప్రైవేటు భూములు 22ఏలో ఉండకూడదన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ దిశగా పని చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవల జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు భూమి అనేది సెంటిమెంటుతో కూడిన వ్యవహారమని, పేదలకైతే అది ఒక భరోసా అని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమ భూములకు సంబంధించి వివాదాలు లేకుండా హాయిగా ఉండాలని చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల భూ వివాదాల పరిష్కారానికి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరిన విషయం తెల్సిందే.