CM Convoy Accident: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో నిర్వహించిన కాన్వాయ్ ట్రయల్ రన్ ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మార్కాపురం జిల్లా (ప్రకాశం) దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన అంకన్న (25) అనే యువకుడిగా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పర్యటించే మార్గంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పోలీసులు, ఉన్నతాధికారులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్వాయ్లోని ఒక వ్యాన్ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్ లోకి ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో తన బైక్పై వెళ్తున్న అంకన్నను ఈ వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి అంకన్న గాల్లోకి ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ట్రయల్ రన్ లో భాగంగా భద్రతను పర్యవేక్షించాల్సిన వాహనమే ఇలా అజాగ్రత్తగా రాంగ్ రూట్ లో రావడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. చేతికి అందిన కొడుకు ఇలా అకాల మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు నిందితుడైన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం భరోసా, తెలంగాణ ప్రగతికి యాక్షన్ ప్లాన్ ఇదే