Chandrababu Naidu: నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ ఐదు నెలల పాలన, సాధించిన విజయాలు , భవిష్యత్తు కార్యాచరణను వివరిస్తూ కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి ఎలా తీసుకువెళ్తున్నారో స్పష్టం చేశారు.
సంక్షేమ పాలన
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి నెల్లూరు జిల్లాకు రావడం ఆనందంగా ఉందంటూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థకు తావులేదని, ప్రజాభిప్రాయమే పరమావధిగా పాలన సాగుతోందని స్పష్టం చేశారు.
ఇంటివద్దకే పెన్షన్ల పంపిణీ
పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపడమే ధ్యేయంగా, ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమేనని, ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే 27,000 కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక అసమానతలను తగ్గించినప్పుడే పేదల జీవితాలు బాగుపడతాయని, ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే తన సంకల్పమని సీఎం అన్నారు.
గ్రామగ్రామానికి బస్సులు
గత ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిన రోడ్ల విధ్వంసాన్ని అధిగమిస్తూ, ప్రస్తుతం గుంతలన్నీ పూడ్చి గ్రామగ్రామానికి బస్సులు నడిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, చేనేత, మత్స్యకార కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘అన్నదాత సుఖిభవ’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ప్రజలు ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పరిపాలన తెస్తామని హామీ ఇచ్చారు.
Also Read: హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి
ప్రతి ఇంటా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు
నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు ఎక్కువగా ఉన్నందున పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టులో దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీని ఏర్పాటు చేసింది కూడా తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే దేశంలోకి వస్తున్న పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని, భవిష్యత్తులో అన్ని పోర్టులను, నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతి ప్రపంచస్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షంపై ధ్వజం – శాంతిభద్రతల పరిరక్షణ
వైసిపిని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి హబ్గా మార్చిందని, వారి హయాంలో ప్రజలు కనీసం స్వేచ్ఛగా మీటింగ్లకు కూడా వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని అమరావతి అవసరం లేదంటూ చట్టబద్ధతను వ్యతిరేకించిన పార్టీ ఇదని దుయ్యబట్టారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించినప్పుడు తాను పడిన మానసిక వేదనను గుర్తుచేసుకుంటూ, సమాజంలో కులచిచ్చులు రేపుతున్న ఇలాంటి రౌడీ, గంజాయి బ్యాచ్లను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని, హోంమంత్రి అనితను కించపరిచేలా మాట్లాడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Also Read: అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి పర్యటన.. విద్యార్థులకు కీలక దిశానిర్దేశం
అధికారులకు ఆదేశాలు
పున్నపువరపాలెంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, కాలువలు, వీధిలైట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పరిపాలనలో నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలోనే నెంబర్ వన్గా
నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాను దేశంలోనే నెంబర్ వన్గా మారుస్తామని, రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులు, భారీ పరిశ్రమలతో రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇదే సమయంలో వైకాపాపై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ఆ పార్టీ సంస్కృతిని, మహిళలపై పెడుతున్న పోస్టులను తీవ్రంగా తప్పుపట్టారు.
గంజాయి హబ్గా ఏపీ: సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. తనపై గతంలో జరిగిన క్లేమోర్ మైన్ల దాడిని గుర్తుచేసుకుంటూ, రాజధాని అమరావతి అభివృద్ధిని కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు.#ChandrababuNaidu #Amaravati… pic.twitter.com/Ux927wJFdk
— BIG TV Breaking News (@bigtvtelugu) July 1, 2026