తెలంగాణలో సామాజిక న్యాయం కోసమే తన పార్టీ పుట్టిందన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. ఇదేమీ మామూలు టాస్క్ కాదు. నా బాట ముళ్ల బాటని తెలుసు. అయినా వెనక్కి తగ్గను… బీసీల కోసం 50 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాను. ఢిల్లీ మీద యుద్దమే చేస్తాను.. అని కవిత స్పష్టం చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను విపులంగా పంచుకున్నారు.
తన ఉద్దేశ్యాలను, పార్టీ భావజాలాన్ని, సిద్దాంతాలను విడమర్చి చెప్పారు. తన అంతిమ లక్ష్యాన్ని వివరించారు. తనకు వయసు ఉంది, ఓపికా ఉందని అన్న ఆమె అంతకు మించి పవిత్ర హృదయం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎత్తుకున్న బతుకమ్మను వదల్లేదు.. ఎత్తుకున్న బోనమూ దించలేదు. ఇప్పుడు బీసీ బోనమెత్తుకుంటున్నా.. దీన్నీ కడవరకు మోస్తా.. అనుకున్నది సాధిస్తా! అని ధీమా వ్యక్తం చేశారామె. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తే తనకు ఎప్పుడూ చైతన్యం చేస్తుందని, ఆయన చూపిన బాటలోనే సాగుతున్నానన్నారు.
మన సిద్దాంతాన్ని వినిపిస్తూనే ఉండాలి. అది ముగ్గురికైనా.. ముప్పై లక్షల మందికైనా..! అని ఆయన అన్నమాటలు ఇప్పటికీ తనలో సామాజిక న్యాయ ఉద్యమాన్ని రగిలించి.. ఆ దిశగా అడుగులు వేసేందుకు జవజీవాలందిస్తాయన్నారు. ఇప్పుడు నా పార్టీకి మద్దతు తక్కువగా ఉండొచ్చు. కానీ అది వేలు, లక్షలు, కోట్లుగా చేరడానికి పెద్ద సమయం పట్టదు. ఆ భావజాల వ్యాప్తి తప్పుకుండా జరుగుతుంది. అది ఓ విప్లవాత్మక మార్పుకు నాంది అవుతుంది. అన్ని పార్టీల్లో సామాజిక న్యాయం చేసి తీరాలనే అనివార్యతను తెచ్చి తీరుతుంది.
అక్కడే నేను సక్సెసయినట్టేనన్నారామె. సామాజిక న్యాయం చేతగాక జెండాలు ఎత్తేసిన ఎంతో మందిని చూశారు.. ఇప్పుడు నన్ను చూడబోతున్నారు. ముందుగా అనుమానపడతారు. కానీ నా పవిత్ర ఆశయం.. లక్ష్య సాధనలో మనసు పెట్టి కొట్లాడే నా వ్యవహార శైలి చూసిన తరువాత నాతో పాటు అడుగేయక మానరు. ఇది నా నిబద్దత. నాకా నమ్మకం ఉందని ఆత్మ విశ్వాసంతో చెప్పారు. సామాజిక న్యాయం అనే అంశం కూడా దేశభక్తి కిందకే వస్తుందున్నారామె.
అగ్రవర్ణాలు కూడా ఓ సందర్భంలో పరివర్తన చెందక తప్పదని, వారంతా అణగారిన వర్గాలకు చేదోడువాదోడుగా నిలుస్తారన్నారు. పాలించే స్థాయిలో ఉన్నవాళ్లే సామాజిక న్యాయాన్ని సాధించే అవకాశం ఉంటుందని, చరిత్ర అదే చెబుతుందన్నారు. తమ పార్టీకి ప్రజా మద్దతు ఎంత ఉందో తెలియజెప్పేది ప్రామాణికం ఎన్నికలేనన్న ఆమె.. ఫలితాలు ఎలా ఉన్నా.. ఓపికతో దాన్ని సవరించుకుని ముందుకు సాగుతామన్నారు. క్రమ క్రమంగా మద్దతు కూడగట్టి మరింత పైకి ఎగబాకుతామన్నారు.
రాజకీయ వ్యూహాలు పన్నడంలో తాను ఎవరికేమీ తీసిపోనని అన్నారు. ఇప్పటి వరకు చేసిన టీఆరెస్ ఉద్యమాలు ప్రభుత్వాన్ని కదిలించాయన్నారు. వెలుగుమట్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలే దీనికి ఉదాహరణ అని చెప్పిన ఆమె.. దసరా తరువాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. బీజేపీని ఎవరూ నమ్మడం లేదని, కాంగ్రెస్ పని ఖతమైందన్నారు. సీఎం రేసులో నేనున్నానని, బీఆరెస్ నుంచి కేటీఆరా.. మరొకరా ముందు తేల్చుకోమనండి అని పరోక్షంగా హరీశే పోటీకి వస్తాడనే విధంగా ఆమె ఆన్సరిచ్చారు.