Chandrababu – Pawan Joint Campaign Cancelled: ఏపీలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికార పార్టీ.. విమర్శలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుతున్నాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తుండగా.. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు (ఏప్రిల్ 16, మంగళవారం) విజయనగరం, నెల్లిమర్లలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.
అనివార్య కారణాలతో ఈ ప్రచార కార్యక్రమం రద్దయింది. బుధవారం మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పాల్గొని ప్రసంగిస్తారు. కాగా.. నేడు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాజాం, పలాస నియోజకవర్గాల్లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలకు హాజరవుతారు. రాత్రికి పలాసలోనే బస చేస్తారు. అలాగే జిల్లా నేతలు, అభ్యర్థులతో సమావేశమై.. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన ప్లాన్ లపై దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read : వైసీపీకి మరో షాక్..? రేపో మాపో టీడీపీ గూటికి..!
కాగా.. ఆదివారం తెనాలిలో ప్రచారం చేసిన పవన్ పై రాళ్లదాడి జరిగిందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అందులో నిజం లేదని పోలీసులు వెల్లడించారు. పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఒక మహిళకు తగిలిందని, దానికే ఇలా ప్రచారం చేశారని స్పష్టం చేశారు. విశాఖలోని గాజువాకలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై కూడా రాయిదాడికి యత్నించారు. ఇది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పనేనంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జగన్ పై జరిగిన దాడిలో నిజనిజాలేంటో పోలీసులు త్వరలోనే తేలుస్తారన్నారు.