Pulivarthi Nani on Bhaskar Reddy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వల్ల వైసీపీ ఆటలు సాగలేదని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడులు చేశారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సటీలో స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇటీవల నానిపై దాడి జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ రోజు తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎన్నికల పోలింగ్ రోజుతో పాటు ఆ తర్వాతి రోజుల్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన వీడియోలను చూపించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అబ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇసుక మాఫియా కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని అందుకు నిరసనగా అప్పట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. చెవిరెడ్డి పోలీసుల ద్వారా దీక్షను భగ్నం చేశాడని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి దొంగ ఓట్ల తోనే 2014 ఎన్నికల నుంచి ప్రతి సారి గెలుస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి చంద్రగిరి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని భాస్కర్ రెడ్డి ప్రయత్నించారని నాని అన్నారు. కానీ అతడి ఆటలు సాగలేవని తెలిపారు. భాస్కర్ రెడ్డి ఎర్ర చందనం మాఫియా నడిపించారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెడతానని.. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తనపై దాడి చేసిన తర్వాతే తన కుటుంబ సభ్యులు స్పందించారని అన్నారు. తనను హతమారుస్తామని హెచ్చరించిన తర్వాతే తన భార్య బయటకు వచ్చి మాట్లాడిందని తెలిపారు.
Also Read: నాకైతే నమ్మకం లేదు.. మంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు
తాను రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకుంది నిజమే అని అన్నారు. కానీ అది ప్రజల కోసమే అని తెలిపారు. 2019 ఎన్నికల నాటి నుంచి తనపై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు. కానీ అక్రమంగా ఇప్పుడు 28 కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు. ప్రజల కోసమే తుదిశ్వాస వరకూ పని చేస్తా అని తెలిపారు.