చిలకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ రహ్మతుల్లాను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో ఎస్ఐ రహ్మతుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గతంలో వెంకటనాయుడు వద్ద నుంచి మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు రెండు కార్లను రహ్మతుల్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రమాదం జరిగిన రోజున వెంకటనాయుడు గ్యాంగ్ సభ్యులతో ఎస్ఐ రహ్మతుల్లా ఫోన్లో పలుమార్లు మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. మరింత అనుమానాస్పద అంశంగా, ఈ ప్రమాదం తన అధికార పరిధిలోకి రాకపోయినా రహ్మతుల్లా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటనాయుడు తండ్రి అయిన ఏఎస్ఐ శ్రీనివాస్ను కూడా అధికారులు బదిలీ చేశారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.