Chinta Mohan: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
చింతామోహన్ మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఆయుధాల కొనుగోలునే అభివృద్ధిగా భావిస్తోందని విమర్శించారు. ప్రజలకు కావలసింది సుపరిపాలన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నేరాలకు కేంద్రంగా మారుతోందని చింతామోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విపరీతమైన అవినీతి రాష్ట్రంగా మారిపోయిందని, దాదాపు రూ.2వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్లో 50 ఏళ్లు ఉండాల్సిన చంద్రబాబు, కేసీఆర్కు భయపడి ఏపీకి వచ్చేశారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ కుటుంబం 11 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరగాలన్నా‘ఆ నలుగురు బ్రోకర్ల’ హవా నడుస్తోందని, వారి ప్రమేయం లేకుండా ఏ పని కావడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొంటూ, అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల సామాన్యులపై భారం పడనుందని హెచ్చరించారు. రాబోయే 20 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 1500 రూపాయలకు చేరుకోనుందని, ఇది ప్రజల నడ్డి విరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.